కరోనా సెకండ్ వేవ్ వేళ భారత్ పడుతున్న కష్టాన్ని చూసి ప్రపంచ దేశాలు చలిస్తున్నాయి. కరోనాపై జరుగుతన్న పోరాటంలో తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. భారత్కు ఆక్సీజన్ కాన్సంట్రేటర్స్, వెంటిలేటర్స్ను పంపిస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించిన కాసేపటికే అమెరికా కూడా స్పందించింది. భారత్కు అన్ని విధాలా సాయం చేస్తామని ఆదివారం రాత్రి వైట్ హౌస్ ప్రకటించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి అవసరమయ్యే ముడిసరుకును తక్షణమే పంపిస్తున్నట్లు తెలిపింది. అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సులివాన్ ఇండియా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిద్ దోవల్తో శుక్రవారం ఫోన్లో మాట్లాడి.. భారత్లో కరోనా పరిస్థితులపై ఆరాతీశారని పేర్కొంది. అనంతరం భారత్కు అవసరమైన సాయాన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భారత్తో వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు కోవిషీల్డ్ తయారీకి అవసరమైన ముడిసరుకును వెంటనే పంపిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. అంతేకాదు ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ కిట్స్, వెంటిలేటర్లు, పీపీఈ కిట్స్ వంటి ఇతర వైద్య పరికరాలను కూడా పంపిస్తామని పేర్కొంది.
United States has identified sources of specific raw material urgently required for Indian manufacture of Covishield vaccine that will immediately be made available for India: US NSA Jake Sullivan to NSA Ajit Doval#COVID19 pic.twitter.com/Df3OpLXQp4
— ANI (@ANI) April 25, 2021
''కోషిఫీల్డ్ వ్యాక్సిన్ తయారీకి అత్యవసరమైన ముడిసరుకును గుర్తించాం. వెంటనే భారత్కు పంపిస్తున్నాం. కరోనా రోగుల చికిత్సకు అందించేందుకు, ఫ్రంట్లైన్ హెల్త్ వర్కర్స్ను కాపాడుకునేందుకు అవసరమైన థెరపిటిక్స్, రాపిడ్ డయాగ్నస్టిక్స్, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లను వెంటనే అందుబాటులో ఉండేలా చూస్తాం.'' అని ఎన్ఎస్సీ అధికార ప్రతినిధి ఎమిలి హార్ని తెలిపారు.
ఇక బయోలాజికల్ ఈ (BE) కంపెనీకి కూడా అమెరికా సాయం చేయనుంది. 2022 నాటికి 100 కోట్ల టీకా డోసులు ఉత్పత్తి చేసేలా బయోలాజికల్ ఈ సామర్థ్యాన్ని పెంచేందుకు యూఎస్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తోడ్పాటును అందించనుంది. మన దేశంలో బయోలాజికల్ ఈ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్పై మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆగస్టు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SSI) ఈ నెలలో అమెరికా ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేసింది. ఆస్ట్రజెనికా వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి సరుకుల ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది. కానీ అమెరికా నుంచి మొదట ఎలాంటి స్పందన రాలేదు. అమెరికా తీరుపై భారత్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో హైడ్రాక్సిక్లోరోక్విన్ వంటి అత్యవసర ముందులను భారత్ పంపించిందని.. కానీ సెకండ్ వేవ్లో భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు కనీస సాయం చేయరా? అంటూ విమర్శలు ఎదుర్కొంది. ఈ క్రమంలో భారత్కు సాయం చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
భారత్కు సాయం చేయనున్నట్లు ఇప్పటికే బ్రిటన్ కూడా ప్రకటించింది. 600 వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ పంపించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం మొదటి ప్యాకేజ్ మంగళవారం నాటికి ఢిల్లీకి చేరుకుంటుందని వెల్లడించింది. మొత్తం 9 ఎయిర్లైన్ కంటెయినర్లలో 495 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్, 120 నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్లు, 20 మాన్యువల్ వెంటిలేటర్లను పంపిస్తోంది.
కాగా, మనదేశంలో శనివారం 3,49,691 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 1,69,60,172కి చేరింది. నిన్న 2,767 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,92,311కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. తాజాగా 2,17,113 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,40,85,110కి చేరింది. ప్రస్తుతం భారత్లో 26,82,751 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 17,19,588 మందికి కరోనా పరీక్షలు చేశారు. భారత్లో ఇప్పటివరకు 27 కోట్ల 79లక్షల 18వేల 810 టెస్ట్లు చేశారు. కొత్తగా 25,36,612 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 14కోట్ల 09లక్షల 16వేల 417 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Corona cases, Corona Vaccine, Corona virus, COVID-19 vaccine, Us news