ఇటీవల జరిగిన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. వచ్చే ఐదు రోజుల పాటు హోం క్వారంటైన్లోనే ఉండనున్నట్టు ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు ఎమ్మెల్యేలు, నేతలు కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా ఆమెను కలిసి అభినందనలు తెలిపారు. అయితే నేడు ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ముందుజాగ్రత్తగా హోంక్వారంటైన్లోకి వెళ్లాలని కవిత నిర్ణయించుకున్నారు. ఐదు రోజులు పార్టీ శ్రేణులు, ప్రజలకు ఎమ్మెల్సీ అందుబాటులో ఉండడం లేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కవిత వెల్లడించారు.
I wish for your speedy and healthy recovery Anna. As I recently came in contact with you, I’ll be quarantining myself for next 5 days as a precautionary measure. I humbly request @trspartyonline cadre to avoid visiting my office for next few days. https://t.co/7Meoco2UCZ
కరోనా బారిన పడిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ త్వరగా కోలుకోవాలని కవిత ఆకాక్షించారు. ఇటీవలే తాను డాక్టర్ సంజయ్ కుమార్ను కలిశానని.. అందుకే ముందు జాగ్రత్త చర్యగా వచ్చే ఐదు రోజులు హోంక్వారంట్లోకి వెళుతున్నట్టు కవిత వివరించారు.
అంతకుముందు టీఆర్ఎస్కు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇటీవల సంజయ్ కుమార్ ఓ వేడుకకు హాజరయ్యారు. ఆ వేడుకలో ఆయనకు కరోనా సోకి ఉండచ్చని భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలకు ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన సమావేశాలకు హాజరుకాలేదు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని తన ఇంట్లో హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. రెండు రోజులుగా సంజయ్ కుమార్ పలువురు ప్రముఖులను కలిసినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను కలిసిన వారికి కూడా కరోనా టెన్షన్ పట్టుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తనను కలిసిన వారు విధిగా పరీక్ష చేయించుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. వారంతా హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డిపై సంజయ్ కుమార్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆయనను గెలిపించేందుకు నాటి నిజామాబాద్ ఎంపీ కవిత ఎంతగానో శ్రమించారు. అందుకే కవిత ఎంపీగా ఓటమిపాలైన అనంతరం జగిత్యాల నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వీలుగా తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రకటించారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత విజయానికి ఎమ్మెల్యే సంజయ్ సైతం తన వంతు కృషి చేశారు.