news18-telugu
Updated: March 27, 2020, 9:10 AM IST
దాడి చేస్తున్న పోలీసు అధికారి
కరోనా వైరస్ విజృంభిస్తోంది.. ప్రజలెవరూ రోడ్లెక్కవద్దు.. అత్యవసర అవసరాల కోసం తప్ప బయట కాలు పెట్టవద్దు.. అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయి. అయితే, కొందరు ఆకతాయిలు రోడ్ల మీదకి వస్తూ ఇబ్బంది కలిగిస్తున్నారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వస్తోంది. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పోలీసులు అలా ప్రవర్తించడంలో తప్పు లేదు. అయితే, కొందరు పోలీసులు విచక్షణ కోల్పోయి, ఓవరాక్షన్ చేస్తున్నారు. కారణం లేకుండానే కొడుతున్నట్లు తెలుస్తోంది. మొన్నకి మొన్న తెలంగాణలో ఓ జర్నలిస్టుపై దాడి చేసిన పోలీసులు.. నిన్న ఆంధ్రప్రదేశ్లోనూ కొందరు జర్నలిస్టులపై దాడులకు తెగబడ్డారు. జర్నలిస్టు అయితే ఏంటి? రోడ్లపై తిరగాలా? అంటూ లాఠీలతో కొడుతున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా జర్నలిస్టులకు ప్రభుత్వం అధికారం కల్పించిందని వ్యాఖ్యానించినా.. కొందరు పోలీసులు ఓవర్గా బిహేవ్ చేస్తున్నారని మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఓ వ్యక్తి పాల ప్యాకెట్ కోసం బయటికి వెళితే పోలీసులు దాడి చేయగా, అతడు స్పృహ తప్పి, దుర్మరణం చెందాడు. తాజాగా.. ఏపీలో తండ్రీ కొడుకులను ఓ ఎస్సై దారుణంగా కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ యువకుడిపై లాఠీ చార్జీ చేసిన ఎస్సై కిరణ్ కుమార్ పై వేటు వేశారు. విదేశాల నుంచి వచ్చి స్వీయ నిర్బందంలో లేడని అతడిపై పోలీస్ దాడి చేశాడు. SI లాఠీచార్జీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో యూనిట్ ఆఫీసర్ ఆగ్రహం వ్యక్తం చేసి, సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఎస్సైని సస్పెండ్ చేసినా.. బాధితుల పరిస్థితి ఏంటని జనం మండిపడుతున్నారు.
తమ ప్రాణాలపై తమకూ పట్టింపు ఉందని, అయితే.. డ్యూటీ పేరుతో పోలీసులు ఇష్టమొచ్చినట్లు కొట్టడం సబబేనా? అని ప్రశ్నిస్తున్నారు. ఓ మార్కెట్కు వెళ్లిన పోలీసులు.. అక్కడ కూరగాయల్ని పాడబోసి, దుకాణాలను తీసేయాలని దాడులు చేసిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ పరిస్థితులపై ప్రజలు, మీడియా, మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులను ప్రభుత్వాలు అదుపు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
March 27, 2020, 9:00 AM IST