కరోనా వైరస్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి రకరకాల ఐడియాలు వేస్తున్నారు ప్రజలు. అయితే, ఎప్పుడూ ప్రజాసేవలో ఉండే పోలీసులు కూడా తమను తాము రక్షించుకోవడానికి, ఎప్పుడూ చేతులు శుభ్రంగా ఉంచుకోవడానికి ఓ కొత్త ఐడియాతో ముందుకొచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చే ప్రజలు, సిబ్బంది తమ చేతులను శుభ్రం చేసుకోవడం కోసం ఒక వినూత్న పరికరాన్ని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఏర్పాటు చేయించారు. దాన్ని నేడు ప్రారంభించారు. ఈ పరికరంలో ఎడమ వైపు ఉన్న స్విచ్ (కార్లలో బ్రేక్ ని తొక్కిన విధంగా)ను కాలితో తొక్కితే లిక్విడ్ హ్యాండ్ వాష్ వస్తుంది. కుడి వైపు ఉన్న స్విచ్ ని కాలితో తొక్కితే, ట్యాప్ (నల్లా ) నుంచి నీళ్ళు వస్తాయి. పై విధంగా లిక్విడ్ హ్యాండ్ వాష్ బాటిల్, ట్యాప్ లను చేతులతో నేరుగా తాకకుండానే చేతులను శుభ్రం చేసుకోగలిగే విధంగా ఒక పరికరాన్ని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తయారు చేయించి, జిల్లా పోలీస్ కార్యాలయం లో ఏర్పాటు చేయించారు. పోలీస్ కార్యాలయానికి వచ్చే ప్రతీ ఒక్కరు కచ్చితంగా తమ చేతులను శుభ్రం చేసుకున్న తరువాతనే కార్యాలయంలోనికి ప్రవేశించాలని ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ సృజన, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నాయుడు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రామకృష్ణా రెడ్డి, ఆర్ఐ లు హరిలాల్, కృష్ణ, డానియల్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ యాదవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Sangareddy, Telangana, Telangana Police