దేశంలో కరోనా కట్టడికి తన వంతు సాయం అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ ను అరికట్టేందుకు ముందుకు వచ్చింది. COVID-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వంతు మద్దతును అందించనుంది. ఇందులో భాగంగా కోవిడ్ సహాయక చర్యలకు ప్రభుత్వం ఉపయోగించే ఎమర్జెన్సీ సర్వీస్ వాహనాలు మరియు అంబులెన్స్లకు రిలయన్స్ పెట్రోల్ బంకులు ఉచిత ఇంధనం అందించనున్నాయి. సంబంధిత ప్రభుత్వ అధికారులు జారీ చేసిన అనుమతి పత్రాల ఆధారంగా అన్ని అత్యవసర సేవా వాహనాలు, అంబులెన్సులకు రోజుకు ఒక వాహనానికి గరిష్టంగా 50 లీటర్ల ఇంధనాన్ని రిలయన్స్ బంకులు ఉచితంగా అందిస్తాయి. ఈ సదుపాయం జూన్ 30 వరకు వర్తిస్తుంది. మరోవైపు ఆక్సిజన్ కొరత సమస్యను సమర్ధంగా ఎదుర్కొనేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు రిలయన్స్ తన వంతు సాయాన్ని అందిస్తోంది. ఈ మేరకు తెలంగాణకు 80 టన్నులు, ఆంధ్రప్రదేశ్ కు మరో 80 టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ ను రిలయన్స్ సమకూర్చింది. ఆక్సిజన్ ఎక్సప్రెస్ ఈ కంటైనర్లను రిలయన్స్ జామ్నగర్ ప్లాంట్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్, గుంటూరు రైల్వే స్టేషన్లకు చేరవేసింది. త్వరలోనే ఇవి ఆస్పత్రులకు చేరనున్నాయి.
కోవిడ్- 19పై దేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా రిలయన్స్ కుటుంబం చేతులు కలిపింది. కోవిడ్-19తో చేస్తున్న పోరాటంలో దేశం విజయం సాధించేలా చేసేందుకు క్షేత్రస్థాయిలో బహుముఖ విధానాలతో కార్యక్రమాలను రిలయన్స్ చేపట్టింది. కరోనా సమయంలో భారతీయుల కష్టాలను తొలగించేందుకు నిర్విరామంగా కృషిచేస్తోంది. అలాగే కొవిడ్ బాధితులు వారు వేగంగా కోలుకునేందుకు సహాయపడింది. వైరస్ కలిగించిన ముప్పును అధిగమించేందుకు తన వనరులు, ఉద్యోగులు, ఉపకరణాలు అన్నిటినీ రిలయన్స్ ఉపయోగిస్తోంది.
రిలయన్స్ 1,000 మెట్రిక్ టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సీజన్ ను దేశవ్యాప్తంగా సమకూరుస్తోంది. ఇది దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తిలో 11 శాతం లేదా ప్రతీ 10 మంది రోగుల్లో ఒకరికి అవసరమైన దాంతో సమానం. దీనికి రిలయన్స్ అండగా నిలిచింది. మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ రవాణాను సులభతరం చేసేందుకుగానూ రిలయన్స్ 32 ఐఎస్ఒ కంటెయినర్లను దిగుమతి చేసుకుంది. భారతదేశంలో కోవిడ్ పై జరుగుతున్న పోరాటంలో తాను చేపట్టిన ఎన్నో కార్యక్రమాలతో రిలయన్స్ ఫౌండేషన్ ముందువరుసలో నిలిచింది. రిలయన్స్ ఫౌండేషన్ భారతదేశ మొట్టమొదటి కోవిడ్ -19 కేర్ హాస్పిటల్ ను కేవలం రెండు వారాల్లోనే ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పేదలకు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి 5.5 కోట్లకు పైగా భోజనాలను సమకూర్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Corona virus, Reliance Foundation, Reliance Industries, Telangana