ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అందరికీ ఒకే భయం ఉంది. అదే కరోనా వైరస్.. ఎప్పుడు మన దగ్గరికి వస్తుందా అనుకున్న వాళ్లకు హైదరాబాద్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. ఇప్పటికే తెలంగాణలో పాజిటివ్ కేసులు కనుగొనడంతో బయటికి కూడా రావడం లేదు జనాలు. ఇదిలా ఉంటే ఇప్పుడు నిర్మాత బండ్ల గణేష్ను కూడా ఈ కరోనా వైరస్ ఖంగు తినిపించింది. ఈ పేరు వినగానే ఇప్పుడు ఈయన వణికిపోతున్నాడు. దానికి కారణం ఆయనకేదో కరోనా వైరస్ వస్తుందని కాదు.. ఈ వైరస్ వల్ల బిజినెస్ నష్టపోతుండటం వల్ల. ఎవరు ఎంత చెప్పినా కూడా ఇప్పటికీ చికెన్ తినడానికి జనం మాత్రం మొహమాటపడుతున్నారు.. ఇంకా చెప్పాలంటే భయపడుతున్నారు.
చికెన్ తింటే కరోనా రాదురా నాయనా అంటూ ఎంత చెప్పినా కూడా ఎందుకు వచ్చిన తంటాలేరా బాబూ అంటూ అంతా నోరు కట్టేసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు బండ్ల గణేష్కు భయం పుట్టిస్తుంది. దానికి కారణం ఆయన తెలంగాణలో పేరు మోసిన ఫౌల్ట్రీ వ్యాపారి కావడమే. షాద్నగర్లో బండ్లకు కోళ్ల ఫారమ్స్ ఉన్నాయి. సినిమాలు లేనపుడు ఆయన అక్కడే హాయిగా రెస్ట్ తీసుకుంటాడు కూడా. చాలా ఏళ్లుగా గుడ్లు, కోళ్ల వ్యాపారం చేస్తున్నాడు ఈయన.
తెలంగాణలో గుడ్ల ధరను నిర్ణయించే అతికొద్ది మంది బిజినెస్ మెన్స్లో బండ్ల గణేష్ కూడా ఉంటాడు. దాన్నిబట్టి ఆయన బిజినెస్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి బిజినెస్ ఇప్పుడు కరోనా దెబ్బకు విలవిలలాడుతుంది. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని చెబుతున్నాడు ఈయన. అలాగే సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ కూడా ఇచ్చాడు బండ్ల గణేష్. కానీ ఆ సినిమాలో కారెక్టర్ అంతగా పేలకపోవడంతో మళ్లీ సినిమాలు చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు ఆయన.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, Coronavirus, Telugu Cinema, Tollywood