news18-telugu
Updated: November 20, 2020, 9:28 AM IST
ప్రతీకాత్మక చిత్రం
యావత్ ప్రపంచమంతా కరోనా వాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు వాక్సిన్లు ఆఖరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఫైజర్, ఆస్ట్రజెనికా ఆక్స్ఫర్డ్, స్పుత్నిక్, కొవాగ్జిన్ వంటి వాక్సిన్లు రేస్లో ముందున్నాయి. మరి ఇవి ప్రజలకు ఎప్పుడు వస్తాయి? ధర ఎంత ఉంటుంది? అని చర్చ జరుగుతున్న వేళ.. సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో ఆడర్ పూనావాలా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో 2021 ఫిబ్రవరి లోపు హెల్త్ కేర్ సిబ్బంది, వృద్ధులకు ఆక్స్ఫర్డ్ వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. అంతేకాదు ఈ వాక్సిన్ ధర రూ. వెయ్యిలోపే ఉంటుందని స్పష్టం చేశారు. వెయ్యి రూపాయలకే రెండు వాక్సిన్ డోస్లు అందజేస్తామని వెల్లడించారు.
హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న పూనావాలా.. 2021 ఏప్రిలో సాధారణ ప్రజలందరికీ ఆక్స్ఫర్డ్ వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 2024 నాటికి దేశంలోని పౌరులందరికీ వాక్సిన్ వేస్తారని పేర్కొన్నారు.
''బహుశా మరో రెండు మూడేళ్లలో భారతీయులందరికీ టీకా వేయడం పూర్తవుతుంది. ఎందుకంటే వందల కోట్ల మంది భారతీయులకు వాక్సిన్ సరఫరా చేయాలంటే బడ్జెట్, లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. 2024లోపు అందరూ టీకా వేసుకుంటారని అనుకుంటున్నాం. ఆక్స్ఫర్డ్ టీకా ధర మన దేశంలో రెండు డోస్లకు రూ.వెయ్యి ఉంటుంది. తక్కువ ధరకే టీకాలను తీసుకురావాలని భారత్ ప్రభుత్వం యోచిస్తోంది. కొవాక్స్ ధరకు సమానంగా ఆక్స్ఫర్డ్ ధర ఉంటుంది. అవసరమైతే ఇంకా కాస్త తక్కువే ఉంటుంది.'' అని పూనావాలా తెలిపారు.
బ్రిటిష్-స్వీడిష్ కంపెనీ ఆస్ట్రాజెనికా, బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా AZD1222 వాక్సిన్ను అభివృద్ధి చేశారు. వాడుక భాషలో ఆక్స్ఫర్డ్ వాక్సిన్గా పిలుస్తున్నారు. మనదేశంలో ఆ వాక్సిన్ ఉత్పత్తికి సీరం ఇన్నస్టిట్యూట్ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఈ వాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ తుది దశలో ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ వాక్సిన్ చౌకయినదని, సురక్షితమైదని సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో పూనావాలా తెలిపారు. 2021 మార్చి నాటికి 20 కోట్ల టీకాలు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు.
మరోవైపు స్వదేశీ టీకా కొవాగ్జిన్ (Covaxin) కూడా మూడో దశ ప్రయోగాలకు సిద్ధమవుతోంది. భారత్ బయోటెక్-ఐసీఎంఆర్ అభివృద్ధి చేస్తున్న ఈ వాక్సిన్పై ఇవాళ్టి నుంచే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. 25 కేంద్రాల్లో 26 మంది వాలంటీర్లు టీకా వేసుకోనున్నారు. వారిలో హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ కూడా ఉన్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 20, 2020, 9:22 AM IST