ఆంధ్రప్రదేశ్ లో కరోనా స్ట్రెయిన్ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారాన్ని విడుదల చేసింది. రాష్ట్రంలో యూకే స్ట్రెయిన్ విస్తరించినట్లు ఎలాంటి దాఖలాలు లేవని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే యూకే స్ట్రెయిన్ వచ్చింది చెప్పారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న కుమారుడికి మాత్రం నెగెటివ్ వచ్చినట్లు స్పష్టం చేశారు. కరోనా స్ట్రెయిన్ సోకిన మహిళ నుంచి మరెవరికీ వ్యాధి సోకలేదని తెలిపారు. ఆమెతో ప్రైమరీ కాంటాక్ట్ అయిన వ్యక్తికి నెగిటివ్ వచ్చినందున కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా స్ట్రెయిన్ వ్యాప్తిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రజలు అపోహల్ని నమ్మొద్దని కాటంనేని భాస్కర్ పేర్కొన్నారు.
యూకే స్ట్రెయిన్ కారణంగా పలు దేశాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. వైద్యశాఖ పోర్టల్ లో నమోదు చేసుకోని ప్రయాణికులను రాష్ట్రంలోకి అనుమతిచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రయాణికుల వివరాలను సేకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఫీల్డ్ లెవల్లో పనిచేస్తున్నాయి. అలాగే సమీపంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ లైన్ డెస్కులను ఏర్పాటు చేసింది. బ్రిటన్ నుంచి వచ్చే వారికి పపరీక్షలు నిర్వహిస్తోంది. ఒకవేళ పాజిటివ్ అని తేలితే తప్పనిసరిగా హాస్పిటల్కు పంపించి చికిత్స అందించనుండగా, నెగటివ్ వచ్చిన వారు మరో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు బ్రిటన్ నుంచి 1,363 మంది ఆంధ్రప్రదేశ్ కు రాగా.., వీరిలో 1,346 మందికి టెస్టులు నిర్వహించారు. మరో 17 మంది వ్యక్తుల చిరునామా తెలియాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు టెస్టులు నిర్వహించిన వారిలో 11 మందికి పాజిటివ్గా నిర్ధారణ కాగా.. వీరిలో ఒక్కరికి మాత్రమే యూకే స్ట్రెయిన్ సోకింది. ఇప్పటివరకు 1,324 మంది క్వారంటైన్లో ఉన్నారని.. వారికి పరిచయస్తులైన 5,784 మందిని గుర్తించి వారి బ్లడ్ శాంపిల్స్ ను ల్యాబ్ కు ప్రభుత్వం తెలిపింది. కొత్తరకం వైరస్ పై నిరంతరం సమీక్ష జరపుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా తమ వివరాలని వైద్య ఆరోగ్యశాఖ వెబ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Published by:Purna Chandra
First published:December 29, 2020, 17:03 IST