బెంగళూరు: భారత్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో కొత్త కేసులు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే కర్ణాటకలో కొత్తగా 40,990 కరోనా కేసులు నమోదు కావడం ఆ రాష్ట్రంలో కోవిడ్-19 తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతున్నాయి. బెంగళూరు నగరంలో మాత్రమే కాదు కర్ణాటకలోని పల్లెలను కూడా కరోనా బెంబేలెత్తిస్తోంది. కర్ణాటకలోని కొప్పళ జిల్లా కుకనూరు తాలూకా విన్నాళ గ్రామంలోని ఒక వార్డులో 70 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ఒక గ్రామంలో ఇన్ని కేసులు వెలుగుచూడటంతో ఆ గ్రామంలోని ఇతర ప్రజలు ఉలిక్కిపడ్డారు. విన్నాళ గ్రామ జనాభా 500. ఇంత చిన్న గ్రామంలో 70 మందికి కరోనా సోకడం పట్ల అధికారులు కూడా వైద్య బృందం వ్యక్తం చేశారు. కరోనా సోకిన వారంతా ఇటీవల గదగ్ జిల్లా రోణలో జరిగిన ఓ పెళ్లికి వెళ్లి వచ్చినట్లు తెలిసింది. ఆ పెళ్లికి వెళ్లి తిరిగొచ్చాక వీరిలో కొందరికి కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో.. టెస్ట్ చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇదిలా ఉంటే.. కర్ణాటకలో సెకండ్ వేవ్ కారణంగా కరోనా మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.
తాజాగా.. 271 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ఇందులో.. ఒక్క బెంగళూరు నగరంలోనే 162 మంది చనిపోవడం ఆందోళన కలిగించే విషయం. కర్ణాటకలో ఇప్పటి దాకా 15,794 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా కారణంగా చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించే విషయంలో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.
యలహంక తాలూకా మావళిపుర గ్రామస్తులు తమ గ్రామ సమీపంలో కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించకూడదంటూ ఆందోళనకు దిగారు. చెత్త డంపింగ్ యార్డుతో గతంలో నానా ఇబ్బందులు పడ్డామని, చాలామంది అనారోగ్యం బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మృతుల అంత్యక్రియల కోసం మంత్రి అశోక్ స్థల పరిశీలనకు వచ్చారన్న విషయం తెలుసుకున్న మావళిపుర గ్రామస్తులు ఈ సందర్భంలో ఆందోళనకు దిగడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona second wave, Covid, Karnataka, Marriage, Villagers