కరోనా కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కేసులను కంట్రోల్ చేసేందుకు నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వీకెండ్ కర్ఫ్యూ ఉంటుందని ఆ రాష్ట్ర మంత్రి అశోక్ తెలిపారు. రాబోయే రెండు వారాల పాటు బెంగళూరులోని 1 నుంచి 9 తరగతి స్కూల్స్ మూసివేస్తున్నట్టు వెల్లడించారు. పెళ్లిళ్ల విషయంలోనూ కొత్త రూల్స్ విధించారు. ఔట్ డోర్లో అయే 200 మంది అతిథులు, ఇండోర్లో అయితే 100 మంది అతిథులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దేవాలయాల్లో కేవలం 50 శాతం మందిని మాత్రమే అనుమతిస్తారని తెలిపారు.
సినిమా హాళ్లు, పబ్లు, జిమ్లలోనూ 50 శాతం మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. 10, 12వ తరగతి విద్యార్థులకు ఆఫ్ లైన్ క్లాసులు ఉంటాయని.. మిగతా వారికి ఆన్లైన్ క్లాసులు కొనసాగుతాయని తెలిపారు. బస్సులు, మెట్రో, ఇతర రవాణా వాహనాల్లో పాటించాల్సిన రూల్స్ను త్వరలోనే ప్రకటిస్తామని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిబంధనలు రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉంటాయని మంత్రి అశోక్ తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం కరోనా కట్టడికి కొత్త రూల్స్ అమలు చేయడంతో సంక్రాంతి పండగ వేళ అక్కడి నుంచి ఇక్కడకు ప్రయాణం చేయాలనుకునే వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. కర్ణాటకలో ప్రతి 2-3 రోజులకు కేసులు రెట్టింపు అవుతున్నాయని తమకు సమాచారం వస్తోందని అన్నారు. కేసుల కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. ప్రజలంతా కరోనా మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చిందని అంగీకరించిన మంత్రి.. రాజధాని బెంగళూరు కరోనా కేసులకు కేంద్రంగా ఉంటుందని అంచనా వేశారు.
బెంగళూరులో ప్రత్యేక చర్యలు తీసుకోవడం చాలా అవసరమని అన్నారు. ఆరు నెలలుగా కర్ణాటకలో 0.1 శాతం కేసులు లేవని... ఒక్కరోజే 1.6 శాతానికి కేసులు పెరగడం థర్డ్ వేవ్కు నాంది అని అభిప్రాయపడ్డారు. ఇన్ఫెక్షన్లు రాష్ట్రంలో 0.4 శాతం నుండి 1.6 శాతానికి పెరిగాయని.. అందులో 90 శాతం బెంగళూరులో నమోదయ్యాయని మంత్రి సుధాకర్ తెలిపారు. కర్ణాటకలో 2,479 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అందులో బెంగళూరులోనే 2,053 కేసులు వెలుగు చూశాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.