news18-telugu
Updated: January 13, 2021, 2:30 PM IST
Gorillas (Photo Credit : San Diego zoo)
ఏడాది కిందట ఆవిర్భవించిన సూక్ష్మాతి సూక్షమైన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇంతలా వణికిస్తుందని, ఇన్నేసి ప్రాణాలు తీస్తుందని ఎవరూ ఊహించలేదు. ఏడాది కాలంలోనే ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. మరింత బీభత్సాన్ని సృష్టించే పనిలో ఉంది. ఈ మహమ్మారి జనంతో పాటు మూగజీవాలను వదలడం లేదు. ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో మనుషుల నుంచి గొరిల్లాలకి వైరస్ సోకింది. అమెరికాలోని శాన్డియోగో సఫారి పార్కులోని ఎనిమిది గొరిల్లాలకి కరోనా సోకినట్టుగా పార్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిసా పీటర్సన్ వెల్లడించారు. కరోనా సోకిన వాటిలో కొన్ని గొరిల్లాలు బాగా దగ్గుతున్నాయని చెప్పారు. పార్కులోని జంతు సంరక్షణ బృందంలోని ఒక వ్యక్తి నుంచి వైరస్ గొరిల్లాలకి సంక్రమించి ఉంటుందని పీటర్సన్ అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయిందని, గొరిల్లాల దగ్గరకి వెళ్లినప్పుడు అతను ఎల్లప్పుడూ మాస్కు ధరించేవాడని చెప్పారు. గత బుధవారం నుంచి గొరిల్లాలు కాస్త నలతగా కనిపిస్తూ దగ్గుతూ ఉండడంతో ఒక గొరిల్లాకి పరీక్షలు నిర్వహిస్తే కరోనా పాజిటివ్గా తేలింది.
మిగిలిన వాటికి కూడా కరోనా సోకినట్టుగానే భావిస్తున్నట్టు జంతు ప్రదర్శన శాల అధికార ప్రతినిధి ఆండ్రూ జేమ్స్ చెప్పారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని కరోనా కట్టడికి లాక్డౌన్ చర్యల్లో భాగంగా డిసెంబర్ 6 నుంచి ఈ జూని మూసే ఉంచారు. గొరిల్లాలలో కరోనా లక్షణాలు బయటపడిన దగ్గర్నుంచి వాటికి ప్రత్యేకంగా ఆహారం ఇస్తున్నారు. విటమిన్లు, ఫ్లూయిడ్స్ అధికంగా అందిస్తున్నారు. వాటి దగ్గరకి వెళ్లినప్పడు సిబ్బంది అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మాస్కుతో పాటు ఫేస్షీల్డ్, కళ్లద్దాలు పెట్టుకొని వెళుతున్నారు. ఈ గొరిల్లాలలో మూడు అంతరించే జాతిలో ఉండడంతో జంతు ప్రేమికుల్లో ఆందోళన నెలకొంది. గత 20 ఏళ్లలో ఈ గొరిల్లాల సంఖ్య 60శాతానిపైగా పడిపోయింది. గతంలో చైనా, హాంకాంగ్, బెల్జియం దేశాలలో పిల్లులు, కుక్కలకు కరోనా సోకినట్టు కనుగొన్నారు. అమెరికాలోని ఓ జూలో పులులు, సింహాలకు కూడా కరోనా సోకినట్టు తేలింది.. యూరప్ దేశాలైన హాలెండ్, డెన్మార్క్, స్పెయిన్ దేశాలలో ముంగీస జాతి జంతువులలో కరోనా ఉన్నట్టు తెలుసుకున్నారు. ఇప్పుడు మొదటిసారిగా గొరిల్లాలకు కూడా కరోనా సోకింది.
Published by:
Sridhar Reddy
First published:
January 13, 2021, 2:30 PM IST