కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తొలివిడతలో రాష్ట్రంలోని ప్రభుత్వ,ప్రవేట్ హెల్తుకేర్ సిబ్బందితో పాటు ఐసిడిఎస్ వర్కర్లు కలిపి 3లక్షల 70వేల మంది హేల్తుకేర్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ తెలిపారు. కోవిడ్-19 వైరస్ నియంత్రణలో భాగంగా త్వరలో చేపట్టనున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా జరిగేలా సంబంధిత శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి సీఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది.
అలాగే కేంద్ర రాష్ట్ర పోలీసులు,ఆర్మడ్ ఫోర్సులు,హోంగార్డు,జైళ్ల సిబ్బంది,విపత్తుల నిర్వహణ సంస్థ వాలంటీర్లు, సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్,మరియు మున్సిపల్ వర్కర్లు,రెవెన్యూ సిబ్బందితో కలిపి 9లక్షల మందికి వ్యాక్సిన్లు వేయడం జరుగుతుందని చెప్పారు.అలాగే 50యేళ్ళ వయస్సు నిండి చక్కెర వ్యాధి,హైపర్ టెన్సన్,క్యాన్సర్ ఊపిరి తిత్తులు వ్యాధితో ఇబ్బంది పడే వారికి కూడా తొలి విడత ఇంజక్సన్ల వేయడంలో ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని అదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు.

కరోనా వ్యాక్సినేషన్పై ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష
రాష్ట్ర స్థాయిలో సిఎస్ అధ్యక్షతన వైద్య ఆరోగ్య,హోం శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు మరికొందరు కార్యదర్శులతో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ నెలకు ఒకసారి సమావేశమై కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఎప్పటికప్పడు సమీక్షిస్తుందని సీఎస్ పేర్కొన్నారు. అలాగే జిల్లా స్థాయిలో కలక్టర్ అధ్యక్షతన జిల్లా ఎస్పి వైద్య ఆరోగ్య తదితర శాఖలతోను, మండల స్థాయిలో తహసిల్దార్ అధ్యక్షతన,మున్సిపాలిటీ స్థాయిలో మున్సిపల్ కమీషనర్ అధ్యక్షతన సంబంధిత శాఖలతో ఏర్పాటు చేసిన టాస్కు ఫోర్సు కమిటీలు వారానికి ఒకసారి సమావేశమై ఇందుకు సంబంధించిన వివిధ అంశాలను సమీక్షిస్తాయని తెలిపారు. అంతేగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఫిర్యాదులు,సూచనలు,సలహాలు తీసుకుని వాటిని సత్వరం పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర,జిల్లా,మండల స్థాయిల్లో 24గంటలూ పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ నిల్వ,సరఫరా,కోల్డుచైన్ నిర్వహణ,ఐస్ బాక్సులు,ప్రీజర్లు,వ్యాక్సిన్ క్యారియర్స్ తదితర అంశాలపై చేపట్టాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ సమీక్షించారు.తొలి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ఇంకా డిమాండుకు అనుగుణంగా కావాల్సిన సహాయ సహకారాలపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడడం జరుగుతుందని సిఎస్ చెప్పారు.వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లకు ఆవకాశం లేకుండా కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా సజావుగా జరిగేలా వివిధ శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు.

కరోనా వ్యాక్సినేషన్పై ఏపీ సీఎస్ సమీక్ష
తొలి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇప్పటికే అవసరమైన ఏర్పాటు చేయడం జరిగిందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు.రాష్ట్ర జిల్లా మండల స్థాయి టాస్కుఫోర్సు కమిటీలను ఏర్పాటు చేయడం జరిందని ఆయా కమిటీలు వారానికి ఒకసారి సమావేశమై వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకుంటాయని తెలిపారు.