దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహిస్తున్నారు. ఒక్కసారి వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. జనవరిలో తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే, తెలంగాణకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొదటగా గ్రేటర్ హైదరాబాద్లోనే వేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న లక్ష మందికి పైగా ఉన్న నర్సులకు కరోనా వ్యాక్సిన్ మొదటగా వేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లపై మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల DMHOలు, రాష్ట్ర ఇమ్యునైజేషన్ ఆఫీసర్, టీఎస్ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో కరోనా వ్యాక్సిన్ వేయడానికి 1100 ప్రాంతాలను గుర్తించనున్నారు. ఆ 1100 ప్రాంతాల్లో కరోనా టీకా వేయిస్తారు. ఈ కరోనా టీకా సెంటర్లను గుర్తించే ప్రక్రియ 2021 జనవరి 10 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
మొదటి దశలో కరోనా వ్యాక్సిన్ హెల్త్ కేర్ వర్కర్లకు వేస్తారు. నర్సులు, మహమ్మారిని ఎదుర్కోవడంలో సేవలు అందించే వారికి టీకా తొలిదశలో అందుతుంది. వారందరికీ పూర్తయిన తర్వాత రెండో దశలో పోలీసులు, మున్సిపల్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ వేస్తారు. మూడో దశలో 50 ఏళ్లు దాటిన వారికి ప్రాధాన్యత లభిస్తుంది. అలాగే, 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్నా కూడా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కూడా మూడో దశలో టీకా లభిస్తుంది.
ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం కొత్తగా 397 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,85,465కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. డిసెంబర్ 28వ తేదీన కరోనాతో ఇద్దరు మృతి చెందినట్టు అందులో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 1,535కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న ( డిసెంబర్ 28) 627 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,77,931కి చేరింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ డిసెంబర్ 28న ప్రారంభమైంది. డ్రై రన్ విజయవంతంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ కృష్ణా జిల్లాలో ఐదు ఆసుపత్రులను కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ కేంద్రాలుగా ఎంపిక చేశారు. వాటిలో పోలింగ్ కేంద్రం లాగానే ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క సెంటర్కు ఐదుగురు వ్యాక్సినేషన్ ఆఫీసర్లను నియమించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి, విజయవాడ ప్రకాష్నగర్లోని అర్బన్ హెల్త్ కేర్ సెంటర్, కంకిపాడు మండల పరిధిలోని ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూర్యారావుపేటలోని పూర్ణా హార్ట్ ఇని స్టిట్యూట్, పెనమలూరు ఆరోగ్య కేంద్రం పరిధిలోని తాడిగడప సచివాలయం-4లోని కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో ఈ కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించారు.