PM Gareeb Kalyan Yojana scheme | సంఘటిత రంగంలోని వారికి వరాలు కురిపించిన కేంద్రం. ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు ఎంప్లాయర్ షేర్, ఎంప్లాయీ షేర్ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. 100 లోపు ఉద్యోగులు ఉన్న సంస్థలకు, ఆ సంస్థల్లో నెలకు రూ.15,000 వేతనం ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది.
కొంతకాలంగా కరోనా వైరస్ ప్రభావం, దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్తో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. దీంతో అన్ని రంగాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 'పీఎం గరీబ్ కళ్యాణ్' పేరుతో ఓ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా రూ.1,70,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. కరోనా వైరస్పై పోరాడేందుకు కృషి చేస్తున్న హెల్త్ వర్కర్లకు రూ.50 లక్షల హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రకటించింది కేంద్రం. ఇది మూడు నెలలు వర్తిస్తుంది.
ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల పేదలను ఆదుకుంటాం. ప్రస్తుతం 5 కేజీల బియ్యం లేదా 5 కేజీల గోధుమలు ఉచితంగా వస్తున్నాయి. దీంతో పాటు ఒకరికి మరో 5 కేజీలు బియ్యం, గోధుమలు, కేజీ పప్పు ఉచితంగా ఇస్తాం. ఒక నెలలో రెండు వాయిదాల్లో ఇవి తీసుకోవచ్చు. ఇక పలు వర్గాలకు నగదు బదిలీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా 8.69 కోట్ల రైతులకు రూ.2,000 వెంటనే బదిలీ చేయనున్నారు. ఉపాధి హామీ కూలీల రోజువారీ వేతనాన్నిరూ.182 నుంచి రూ.202 చేసింది కేంద్రం. ఒకరికి రూ.2,000 వరకు లాభం ఉంటుంది. ఈ నిర్ణయం 5 కోట్ల కుటుంబాలకు ఇది మేలు చేస్తుంది.
ఇక 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతులకు ప్రస్తుతం లభిస్తున్న పెన్షన్ కన్నా అదనంగా రూ.1,000 ఇస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. మూడు కోట్ల మంది లబ్ధిదారులకు మేలు చేస్తుందన్నారు. జన్ ధన్ అకౌంట్లు ఉన్న 20 కోట్ల మహిళలకు నెలకు రూ.500 మూడు నెలల వరకు ఇస్తామన్నారు. ఉజ్వల స్కీమ్లో ఉన్న 8 కోట్ల కుటుంబాలకు మూడు నెలల పాటు ఉచితంగా సిలిండర్లు ఇస్తామని తెలిపారు. 63 లక్షల స్వయం సహాయక గ్రూపుల్లోని 7 కోట్ల మహిళలకు దీన్ దయాల్ యోజన పథకం ద్వారా రూ.20,00,000 వరకు ష్యూరిటీ లేకుండా రుణాలు.
సంఘటిత రంగంలోని వారికి వరాలు కురిపించిన కేంద్రం. ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు ఎంప్లాయర్ షేర్, ఎంప్లాయీ షేర్ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. 100 లోపు ఉద్యోగులు ఉన్న సంస్థలకు, ఆ సంస్థల్లో నెలకు రూ.15,000 వేతనం ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ రెగ్యులేషన్లో సవరణలు చేసినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నవారు నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ 75% వరకు లేదా మూడు నెలల వేతనం ఇందులో ఏది తక్కువ అయితే అది తీసుకోవచ్చని తెలిపారు. ఈ నిర్ణయం 4 కోట్లకు పైగా ఉద్యోగులకు మేలు చేస్తుంది.
భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి వారిని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. రూ.31,000 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నిధులతో 3.5 కోట్ల మంది రిజిస్టర్డ్ భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకుంటామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.