'స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష'..! 'సామాజిక దూరమే కరోనాకు మందు'..! ప్రభుత్వాలు పదే పదే ఇది చెబుతున్నా.. ఇప్పటికీ చాలా మంది పట్టించుకోవడం లేదు. లాక్డౌన్ను ఉల్లంఘించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా కొండసముద్రం గ్రామంలో స్థానికులు లాక్డౌన్ను ఉల్లంఘించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ వందల సంఖ్యలో గుమిగూడారు. లాక్డౌన్ను ఉల్లంఘించి వాళ్లేం చేశారో తెలుసా.. కరోనా రావొద్దంటూ గంగమ్మ తల్లికి పూజలు చేశారు. గుంపులు గుంపులుగా బయటకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరూ సామాజిక దూరం పాటించలేదు. ఏ ఒక్కరికీ మాస్క్లు లేవు. మాస్క్లు ధరించి.. సామాజిక దూరం పాటిస్తే.. కరోనా దరిచేరదని ప్రభుత్వాలు చెబుతుంటే వాటిని పట్టించుకోలేదు. కానీ నీవే దిక్కు తల్లీ.. అంటూ గంగమ్మకు పూజలు చేశారు. ఐతే ఇంత జరుగుతున్నా.. ఊర్లే ఏ ఒక్కరూ వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేయలేదు. అధికారులు సైతం పట్టించుకోలేదు. ఇలాంటి ఘటనలతోనే వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏపీ వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 757 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ కోలుకొని 96 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 22 మంది చనిపోయారు. ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 639గా ఉంది. వీరందర్నీ ఐసోలేషన్ వార్డులో అన్ని సౌకర్యాలూ కల్పించి ఉంచారు. కర్నూలులో అత్యధికంగా 184 కరోనా కేసులు నమోదవగా.. గుంటూరులో 158, క్రిష్ణా జిల్లాలో 83, నెల్లూరులో 67 మంది కరోనా బారినపడ్డారు. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కరోనా ఫ్రీ జిల్లాలుగా కొనసాగుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Coronavirus, Covid-19, Lockdown