తిరుమలపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఇప్పటికే పలువురు సిబ్బందితో పాటు అర్చకులు కూడా కరోనా బారినపడ్డారు. ఇదే అదనుగా కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. టీటీడీ అర్చకులు డాలర్ శేషాద్రికి కరోనా పాజిటివ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనకు కరోనా సోకిందని..జీయంగార్ల పరిస్థితి ఎలా ఉందని ఎస్వీ బద్రీ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. ఇంత జరుగుతున్నా సీఎం జగన్, టీటీడీ చైర్మన్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు దర్శనాలు నిలిపివేసి స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహించకపోతే ఖర్మను అనుభవిస్తారంటూ పేర్కొన్నారు.
డాలర్ శేషాద్రిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన టీటీడీ.. పోలీసులకు ఫిర్యాదుచేసింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డాలర్ శేషాద్రి వయసు రిత్యా ప్రతి 2 నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటారు. అందులో భాగంగానే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి ఇటీవల పరీక్షలకు వెళ్లొచ్చారు. ఇప్పటికే మూడు సార్లు కోవిడ్ పరిక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ తనకు కరోసా సోకిందంటూ.. మానసికంగా వేధించడంతో పాటు భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని డాలర్ శేషాద్రి వాపోయారు.
కాగా, తిరుమల కొండపై కరోనా వైరస్ టెన్షన్ రేపుతోంది. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనాతో కన్నుమూశారు. మరో 18 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ రావడంతో శ్రీనివాసం క్వారంటైన్ కేంద్రానికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆలయ పెద్దజీయర్, చిన్న జీయర్కి కూడా కరోనా సోకింది. అంతేకాదు జులై 11 నుంచి 140 మంది టీటీడీ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ పరిస్థితుల్లో తాత్కాలికంగా శ్రీవారి దర్శనాలు నిలిపివేసే ఆలోచనకు టీటీడీ వచ్చినట్లు తెలిసినా.. ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేకపోవడంతో టీటీడీ పాలక మండలి కూడా దర్శనాల్ని కొనసాగించేందుకే సిద్ధమైనట్లు తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd