news18-telugu
Updated: October 2, 2020, 8:15 PM IST
ప్రతీకాత్మక చిత్రం
కరోనా వైరస్ ముప్పు తొలగకపోయినా.. మెల్లిమెల్లిగా అన్లాక్ విధానంతో మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రజల్లో మాత్రం కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది ? మళ్లీ ఆ పాత రోజులు ఎప్పుడు వస్తాయి ? అని ఎదురుచూస్తున్నారు. కరోనా వ్యాక్సిన్కు సంబంధించిన పాజిటివ్ న్యూస్ వస్తే విని సంతోషిస్తున్నారు. అయితే కరోనాను సమర్థవంతంగా నియంత్రించే వ్యాక్సిన్ అందరికీ పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంలో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. తాజాగా కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.
అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది జనవరి నాటికి భారత్లో సమర్ధవంతమైన కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలపారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందనేది స్పష్టంగా చెప్పడం కష్టసాధ్యమేనని గులేరియా వ్యాఖ్యానించారు. మానవ పరీక్షల దశ దాటుకుని, ఇన్ఫెక్షన్ను ఎదుర్కొనే సామర్థ్యం వ్యాక్సిన్కు ఉందని నిరూపణ కావడం వంటి పలు అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని గులేరియా కామెంట్ చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం అంతా సవ్యంగా సాగితే వచ్చే ఏడాది ఆరంభంలోనే 19 వ్యాక్సిన్ మార్కెట్లో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. వ్యాక్సిన్ ఎవరికి ముందు ఇవ్వాలనే దానిపై కూడా గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా(ఫైల్ ఫోటో)
తొలి సరఫరాలు దేశంలో జనాభా అంతటికి సరిపడే డోసులు ప్రాథమికంగా అందుబాటులో ఉండవని ఆయన అన్నారు. అందుకే ప్రజలంతా మాస్కులు ధరించి కరోనా వ్యాప్తిని అరికట్టే విషయంలో శ్రద్ధ వహించాలని సూచించారు. వ్యాక్సిన్ సిద్ధం కాగానే, జనాభాకు అనుగుణంగా తయారీ, పెద్ద ఎత్తున పంపిణీ చేపట్టడం ప్రధాన సవాళ్లుగా ముందుకొస్తాయని గులేరియా తెలిపారు. భారత్లో వ్యాక్సిన్ పంపిణీపై ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభమయ్యాయని వెల్లడించిన గులేరియా.. వ్యాక్సిన్ను ప్రాథాన్యతా క్రమంలో ప్రజలకు అందించడం జరుగుతుందని అన్నారు. వైరస్ సోకే ముప్పు అధికంగా ఉన్నవారికి ముందుగా వ్యాక్సిన్ ఇస్తారని అన్నారు.
ఆరోగ్య కార్యకర్తలతో పాటు వైరస్పై ముందుండి పోరాడే ఇతర కరోనా యోధులకు వ్యాక్సిన్ పంపిణీలో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. వైరస్ బారినపడి మరణించే అవకాశం అధికంగా ఉన్న గ్రూపులకు కూడా తొలుత వ్యాక్సిన్ ఇస్తారని అన్నారు. ప్రాధాన్యతా జాబితాను రూపొందించి దానికి అనుగుణంగా వ్యవహరిస్తే వ్యాక్సిన్ పంపిణీ సమంగా సాగుతుందని గులేరియా తెలిపారు. ప్రాధాన్యతా జాబితాను అనుసరించని పక్షంలో అది మరిన్ని మరణాలకు దారితీయడంతో పాటు వైరస్ వ్యాప్తి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Published by:
Kishore Akkaladevi
First published:
October 2, 2020, 8:06 PM IST