ఆదివారం నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ (Corona Vaccine Booster Dose) కూడా ఇవ్వనున్నారు. కరోనా నాలుగో దశ వ్యాప్తి వచ్చే అకాశముందని నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో.. ముందుజాగ్రత్తగా ప్రికాషన్ డోస్ (Precaution Dose)కు ఓకే చెప్పింది. డాక్టర్లు, వైద్యఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో పాటు 60 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రభుత్వమే ఉచితంగా బూస్టర్ డోస్ వేస్తోంది. ఐతే 18-59 ఏళ్ల వయసున్న సాధారణ ప్రజలకు మాత్రం బూస్టర్ డోస్ ఉచితం కాదు. డబ్బులు చెల్లించాలి. అంతేకాదు ప్రభుత్వ టీకా కేంద్రాల్లో వీటిని వేయరు. ప్రైవేట్ సెంటర్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. మరి ధర ఎంతో తెలుసా..?
మన దేశంలో ఎక్కువ మందికి కోవిషీల్డ్ (Covishield), కోవాగ్జిన్ (Covaxin) టీకాలను వేశారు. కోవిషీల్డ్ని పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేయగా... కోవాగ్జిన్ను హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసింది. కోవిషీల్డ్ బూస్టర్ డోస్ టీకా ధరను రూ.600గా నిర్ణయించింది సీరం ఇన్స్టిట్యూట్. కోవాగ్జిన్ ధరను భారత్ బయోటెక్ ఇంకా ప్రకటించలేదు. ఇక కరోనా వ్యాక్సిన్ సర్వీస్ చార్జీకి సంబంధించి కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ఇవాళ కీలక ప్రకటనచేసింది. ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లు సర్వీస్ చార్జీనిరూ.150 కంటే ఎక్కువగా వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కోవిషీల్డ్ బూస్టర్ డోస్ ధర.. 750గా ఉంటుంది. ఇందులో టీకా ధర 650, సర్వీస్ చార్జీ 150. జీఎస్టీ అదనం. కొవాగ్జిన్ ధర ఖరారైన తర్వాత.. ఆ బూస్టర్ డోస్పై స్పష్టత వస్తుంది.
ఏప్రిల్ 10 (ఆదివారం) నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్రాల ఆరోగ్యశాఖ కార్యదర్శులతో కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి సమావేశమయ్యారు. రేపటి నుంచి చేపట్టబోయే బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్పై దిశానిర్దేశం చేశారు. మూడో డోస్కు ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ అవసరం లేదని చెప్పారు. నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లి టీకాలు వేసుకోవచ్చు. ఆ వివరాలను కోవిన్ పోర్టల్లో అప్డేట్ చేస్తారు. మొదటి రెండు డోస్లు ఏ వ్యాక్సిన్ తీసుకుంటే మూడో డోస్ కూడా అదే టీకా తీసుకోవాల్సి ఉంటుంది. 18 ఏళ్ల వయసు పైబడి... 9 నెలల క్రితం లేదా 39 వారాల క్రితం రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారంతా మూడవ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. రెండు డోస్లు కొవాగ్జిన్ తీసుకుంటే.. కోవాగ్జిన్ తీసుకోవాలి. కోవిషీల్డ్ తీసుకుంటే.. ఇప్పుడు కూడా కోవిషీల్డ్ తీసుకోవాల్సి ఉంటుంది.
XE variant: షాకింగ్ న్యూస్ : ఇండియాను తాకిన కరోనా కొత్త రకం.. ముంబైలో తొలి ఎక్స్ఈ కేసు
కాగా, ప్రస్తుతం మన దేశంలో కరోనా వ్యాప్తి బాగా తగ్గింది. అక్కడక్కడా కొన్ని కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా రోజుకు కేవలం వెయ్యి కరోనా కేసులు మాత్రమే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల కూడా కరోనా ఆంక్షలను సడలించాయి. అంతటా మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు మాస్క్లు లేకుండానే బయట తిరుగుతున్నారు. ఐతే కరోనా ప్రమాదం ఇంకా ముగియలేదు. చైనా సహా చాలా దేశాల్లో కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగింది. పలు దేశాలను వణికిస్తున్న కరోనా ఎక్స్ఈ వేరియెంట్ మనదేశానికి కూడా పాకింది. ముంబైలో తొలి కేసు నమోదయింది. ఇవాళ గుజరాత్లో కూడా మరో కేసులు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ వేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, COVID-19 cases, COVID-19 vaccine