కరోనా కలకలం ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఏపీలో ప్రతి రోజు 11 వేలకుపైగా కేసులు నమోదవుతుంటే. అందుకు సరిపడ వైద్య సదుపాయాలు లేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు లేవు. ఊపిరి అందక ఇబ్బందులు పడే వారికి ఆక్సిజన్ సరిపడ సరఫరా లేదు. విజయవాడ లాంటి ప్రధాన పట్టనాల్లో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి. కేవలం కొన్ని గంటల వరకు సరిపడ ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు అల్లాడుతున్నారు. వెంటిలేటర్ పైనే వందలాది రోగులు ఉంటున్నారు. అయితే ప్లాంట్ నుంచి సరఫరా అవ్వడం లేదని సప్లైయర్స్ చేతులు ఎత్తేస్తున్నారు. ఆస్పత్రుల్లో ఉంచి వైద్యం అందించే పరిస్థితి కనిపించడం లేదు. ఒంగోలులో పరిస్థితి చూస్తే అయ్య బాబోయే అనేలా ఉంది.
ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో రోజు రోజుకూ కోవిడ్ బాధితుల సంఖ్య రెట్టింపు అవుతోంది. కరోనాతో ఇబ్బంది పడుతూ బెడ్లు కేటాయించలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఆక్సిజన్ బెడ్లన్నీ నిండిపోవడంతో బాధితులు ఆసుపత్రి ఆవరణలోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఊపిరాడని పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక ఉపశమనం కోసం ఆరు బయటే ఆక్సిజన్ సిలిండర్ ను ఏర్పాటు చేశారు. కానీ అటు వైపు వైద్యాధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడంతో బాధితులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వైద్యం కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రకాశం జిల్లాలోని 15 కొవిడ్ ఆసుపత్రుల్లో 186 ఐసీయూ బెడ్లలో 72 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్లు 940గాను 127 అందుబాటులో ఉన్నాయి. సాధారణ బెడ్లు 470కిగాను 99 అందుబాటులో ఉన్నాయి. మొత్తం 1,596 పడకలను ఏర్పాటుచేయగా 295 అందుబాటులో ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అసలు జిల్లా డాస్ బోర్డులో పరిస్థితి ఒకలా ఉంటే. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఇప్పటికే జిల్లాలోని కొవిడ్ ఆసుపత్రుల్లో పడకలన్నీ నిండిపోగా, వందలమంది వెయిటింగ్లో ఉన్నారు. ఆ దుస్థితి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది.
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ ఘటన ప్రశ్నించేలా చేస్తోంది. బీడీ కాలనీకి చెందిన జయలక్ష్మి అనే ఆమె బాగా నీరసించి, సొమ్మసిల్లి ఆసుపత్రికి వచ్చింది. కోవిడ్ రిపోర్ట్ ఉంటేకానీ వైద్యం చేయించలేమని అక్కడి వైద్యులు స్పష్టం చేశారు. పోనీ వెంటనే కరోనా టెస్టు చేయించుకుందామంటే.. వారం అయితే కానీ ఫలితం రావడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక బాధితురాలి కుటుంబ సభ్యులు వైద్యం చేయమని అక్కడి డాక్టర్లను ప్రాధేయపడ్డారు. అయితే వైద్యుల మనస్సు కరగలేదు. వైద్యులు సరైన సమయంలో స్పందించకపోవడంతో మహిళ అక్కడే మృతి చెందింది. ఆమె ప్రాణాలు పోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితురాలి బందువులు ఆందోళనకు దిగారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Corona cases, Corona patient, Corona positive, Eluru, Ongole, Oxygen, Vijayawada