news18-telugu
Updated: July 26, 2020, 10:19 AM IST
తాళం తీయిస్తున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్లో రోజురోజూకీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. లాక్డౌన్ నిబంధనలకు సడలింపులివ్వడంతో కరోనా విజృంభిస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో మానవత్వం కనుమరుగైపోతోంది. ఆ మహమ్మారి పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఓవైపు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఇంకా చాలామంది కరోనా పేరుతో దాష్టీకంగా ప్రవర్తిస్తున్నారు. కరోనా వైరస్ భయానికి కన్నవారికి.. కట్టుకున్నవారిని నడిరోడ్డుపైనే వదిలివెళుతున్న ఘటనలు కొకోల్లలు. కరోనా వైరస్ పట్ల సరైన అవగాహన లేక కరోనా బాధితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఓ యజమాని తన ఇంట్లో అద్దెకు ఉంటున్న మహిళకు కరోనా సోకిందని ఇంట్లో పెట్టి తాళం వేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి తాళాలు తీయించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలేరమ్మ గుడి బజారుకు చెందిన కడియాల శ్రీలక్ష్మి ఇంటిలో పమిడి రామదుర్గ అనే మహిళ తన కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటోంది.
అయితే వారికి కరోనా సోకిందని.. ఇంటి యాజమాని కడియాల శ్రీలక్ష్మి ఆ కుటుంబాన్ని ఇంట్లో పెట్టి బయటి నుంచి తాళం వేసింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న బాధితులు ఘటనాస్థలానికి చేరుకుని తాళం తీయించారు. కరోనా వైరస్ పట్ల ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. కరోనా వైరస్ పట్ల స్వీయ జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉంటే.. ఇంటిలో కరోనా బాధితులు ఉన్నా.. పక్కవారికి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
Published by:
Narsimha Badhini
First published:
July 26, 2020, 8:03 AM IST