CM YS JAGANMOHAN REDDY TOOK KEY DECISION ON CORONA TESTS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Corona Tests in AP: కరోనా టెస్టులపై సీఎం జగన్ కీలక ఆదేశాలు... ఇకపై ఈ టెస్టులు ఉండవు..
వైఎశ్ జగన్ (ఫైల్)
ప్రస్తుతం ఏపీలో కరోనా అనుమానితులకు ఆర్టీపీసీఆర్,(RTPCR Test) ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. వీటిపై సీఎం జగన్ (CM YS Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా నిర్ధారణ పరీక్షలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నందున వైరస్ అనుమానితులకు టెస్టులు చేసే విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై అనుమానితులకు ర్యాపిట్ టెస్టులు చేయవద్దని.. కేవలం ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో నిరంతరం కోవిడ్ టెస్టులు జరుగుతుండాలని.., అవి కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే నిర్వహించాలి. దీనివల్ల కచ్చితమైన ఫలితాలు వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్నందున ఆస్పత్రులపై గతంలా మాదిరిగా ఒత్తడి ఉండదన్న సీఎం... కోవిడ్ చికిత్స కోసం గుర్తించిన ఆస్పత్రులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. దీనికోసం నియమించిన అధికారులు, ఆరోగ్య మిత్రలు ఆయా నెట్వర్క్ ఆస్పత్రుల్లో సిబ్బంది పనితీరుతో పాటు నాణ్యమైన భోజనం, శానిటేషన్, మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్, మందుల సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో ప్రమాణాలపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించాలన్న సీఎం.., ఆరోగ్యశ్రీ రోగులకు కచ్చితంగా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాల అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 322 ఆస్పత్రుల్లో కోవిడ్ సేవలు అందుతున్నాయి. 4,592 ఐసీయూ బెడ్స్లో 3,196 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. 19,258 ఆక్సిజన్ బెడ్స్కు గానూ, 15,309 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్టు లెక్క. ఎక్కడా అలసత్వానికి తావుండకూడదని ముఖ్యమంత్రి అన్నారు.
థర్డ్ వేవ్ అంశంపైనా సీఎం జగన్ పలు వ్యాఖ్యలు చేశారు. “థర్డ్ వేవ్ వస్తుందో లేదో మనకు తెలియదు. మొదట్లో పిల్లలపై ప్రభావం చూపుతుందని అన్నారు. కాని ఆ పరిస్ధితి ఉండకపోవచ్చని ఇప్పుడు అంటున్నారు. ఏదిఏమైనా మనం సిద్ధంగా ఉండాలి. థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. అన్ని బోధానాసుపత్రుల్లో చిన్న పిల్లల బెడ్స్ ఉన్నాయా ? లేదా ? చూసుకోవాలి. వారికి ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేయాలి. ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు, పీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్అందుబాటులో ఉన్నాయా లేదా తనిఖీ చేయాలి. అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్నది కచ్చితంగా చూడాలి. 10 కేఎల్ ఆక్సిజన్ కెపాసిటీ ప్లాంట్లు పెడుతున్నాం. ఈ పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయా ? లేదా ? చూసుకోవాలి.” అని అన్నారు.
కోవిడ్ నివారణకు వాక్సినేషన్ ఏకైక పరిష్కారమని సీఎం జగన్ అన్నారు. కేంద్రం మనకు కావాల్సినన్ని వాక్సిన్లు ఇవ్వదని... వాళ్లు కేటాయించినవే మనం వాడుకోవాలన్నారు. వాక్సినేషన్లో ఇంకా చాలా దూరం మనం వెళ్లాల్సి ఉందన్న సీఎం.., ఏపీలో ఇప్పటివరకు 1,28,84,201 మందికి వాక్సినేషన్ పూర్తయిందన్నారు. వీరిలో 32,58,885 మందికి డబుల్ డోస్ వాక్సినేషన్ పూర్తి కాగా, 96,25,316 మందికి ఒక డోసు వాక్సినేషన్ పూర్తయింది. 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో కనీసం 90 శాతం వాక్సినేషన్ పూర్తయితే, తర్వాత… మిగిలిన కేటగిరీల వారిపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.