కరోనా లాక్డౌన్ తరువాత ప్రతి నెల పరిస్థితిని బట్టి నిబంధనల్లో సడలింపులు ఇస్తున్న కేంద్రం.. అక్టోబర్ నెల ముగుస్తుండటంతో ఈసారి నిబంధనల్లో మరిన్ని మార్పులు చేస్తుందో అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే దీనిపై తాజాగా కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్లాక్ 5లో భాగంగా ప్రకటించిన సడలింపులు.. నవంబర్ 30 వరకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
గత నెల అన్లాక్ 5 సడలింపులను ప్రకటించిన కేంద్రం.. అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. అయితే దీనిపై ఆయా రాష్ట్రాలు, విద్యాసంస్థలే నిర్ణయం తీసుకుంటాయని తెలిపింది. విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఇదే సమయంలో ఆన్ లైన్, డిస్టెన్స్ విద్యకే ప్రాధాన్యతను ఇస్తున్నట్టు చెప్పింది. అయితే 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న విద్యార్థుల విషయంలో మాత్రం కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విద్యాసంస్థలు అనుమతి తీసుకోవాలని చెప్పింది. విద్యార్థుల హాజరు విషయంలో పట్టుపట్టకూడదని కండిషన్ పెట్టింది. ఇదే సమయంలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, ఎగ్జిబిషన్ హాల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో వీటిని నిర్వహించాలని తెలిపింది. అయితే కంటైన్మెంట్ జోన్లలో మాత్రం అక్టోబర్ 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని చెప్పింది.

నరేంద్ర మోదీ (credit - Twitter)
లాక్డౌన్ విషయంలో సడలింపులు ఇస్తున్న కేంద్రం.. కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరుతోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ కొద్దిరోజుల క్రితం స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రజలకు సందేశం ఇచ్చారు. లాక్డౌన్ పోవడం అంటే కరోనా పోయినట్టు కాదని ఆయన స్పష్టం చేశారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంతవరకు.. దాని విషయంలో అజాగ్రత్త వద్దని సూచించారు. పండగల సమయంలో కరోనా విషయంలో మరింత అప్రమత్తత అవసరమని సూచించారు.
Published by:Kishore Akkaladevi
First published:October 27, 2020, 16:50 IST