అసలే కరోనాతో ప్రజలు వణికిపోతుండగా, ఇప్పుడు కొత్తగా బ్లాక్ ఫంగస్ ఒకటి వెలుగులోకొచ్చింది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కోవిడ్–19 నుంచి కోలుకున్న వారిలో ముకోర్మైకోసస్ అని పిలిచే బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. కరోనా నుంచి కోలుకున్న కొంతమంది ఈ ఫంగస్ దెబ్బకు కంటి చూపును సైతం కోల్పోతున్నారు. గత 15 రోజుల్లో సూరత్లో 40 మందికి ఈ వ్యాధి సోకగా 8 మందికి కంటి చూపు కోల్పోయారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 200 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇది అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ అని, దీని మరణాల రేటు 50% కంటే ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టరేట్ (డిఎంఈఆర్) అధిపతి డాక్టర్ తాత్యారావు లాహనే ఈ వ్యాధి గురించి పూర్తి వివరాలను వెల్లడించారు. ఇది క్రమంగా దృష్టి లోపానికి దారితీస్తుందని చెప్పారు.
ముకోర్మైకోసిస్ అంటే ఏమిటి?
ఇది మనుషులకు అరుదుగా సోకే ఫంగల్ ఇన్ఫెక్షన్. కరోనా సోకిన వారిలో, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ముకోర్మైకోసిస్ ముకోర్ అనే ఫంగస్ వల్ల ఇది వ్యాపిస్తుంది. ఇది తడి ఉపరితలాల నుంచి ఎక్కువగా సోకుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు వి కె పాల్ పేర్కొన్నారు.
లక్షణాలేంటి?
కరోనా నుంచి కోలుకున్న వారికి రెండు మూడ్రోజుల్లో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. తొలుత సైనస్లో చేరి తర్వాత కండ్లపై ఇది దాడి చేస్తుంది. తర్వాత 24 గంటల్లో బ్రెయిన్ వరకు వెళ్తుంది. ఆ తర్వాత బ్రెయిన్ డెడ్ అయిన చనిపోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన వారిలో ముఖం వాపు, తలనొప్పి, జ్వరం, కళ్ల వాపు, అవయవాల్లో నల్లటి మచ్చలు, ముక్కు ఒక వైపు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన డయాబెటిస్తో ఇబ్బంది పడుతున్న వారు త్వరగా కోలుకునేందుకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారని.. ఇది బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్కు దారితీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
ట్రీట్మెంట్ ఉందా?
బ్లాక్ ఫంగస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని సైంటిస్టులు చెబుతున్నారు. దీన్ని ముందే గుర్తించి యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చంటున్నారు. సమస్య తీవ్రంగా ఉన్న వారిలో యాఫోటెరిసన్ ‘బీ’ వంటి యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లను ఇచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం ఈ మందుల కొరత ఉన్నందున చికిత్స కూడా పెద్ద సవాలుగా మారింది. దీనికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక రోగికి సాధారణంగా 21 రోజుల పాటు ఇంజెక్షన్ ఇవ్వాలి. ఈ ఇంజెక్షన్ కోసం రోజు సుమారు రూ. 9,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి అదనంగా బెడ్ ఛార్జీలు, ఇతర మందులు వంటివి భరించాల్సి ఉంటుందని డాక్టర్ తాత్యారావు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Black Fungus, Covid, Gujarat, Maharashtra