P. Bhanu Prasad, Correspondent, Visakhapatnam, news18
ఓ వైపు కరోనా భయం వెంటాడుతోంది. వయసుతో సంబంధం లేకుండా అంతా కరోనా బారిన పడుతున్నారు. యువకులు సైతం కరోనా కారణంగా మరణిస్తున్నారు. దీంతో కరోనా అంటేనే హడలి పోవాల్సి వస్తోంది. ఇలా ప్రజల్లో ఉన్న భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. కరోనా సెకండ్ వేవ్ ఆంధ్రప్రదేశ్ లో తీవ్రంగా విజృంభిస్తూ.. ప్రజల ప్రాణాలను హరిస్తూ ... కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. మరోవైపు వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా బాధితులకు చికిత్సలు అందిస్తున్నారు. కానీ కాసుల కక్కుర్తితో అక్రమ సంపాదనకు, అవినీతికి అలవాటు పడ్డ కొందరు పెద్దలు.. ఈ మృత్యువిహారంలోనూ కాసుల వేటకు తెగబడుతున్నారు. అతి పెద్ద డ్రగ్ స్కామ్ కు తెరదీశారు. కరోనా బాధితుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ప్రస్తుతం కరోనా చికిత్సలో కీలకంగా భావించే రెమ్డెసివిర్ కోసం ఒకానొక దశలో దేశం యావత్తూ కొట్టుమిట్టాడింది. ఆ దశలో రెమ్డెసివిర్ ను ఏడెనిమిది రెట్లు అధిక ధరకు బ్లాక్ లో అమ్మిన సంఘటనలు కూడా చూశాం. సరిగ్గా ఈ డిమాండ్ నే ఆసరాగా తీసుకుని డ్రగ్ రాకెట్ నడిపించారుకొందరు. విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పేషంట్లకు కాలం చెల్లిన రెమ్డెసివిర్ ఇంజక్షన్లు ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
సాధారణంగా భారత డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలోని సెక్షన్ 104ఏ కింద.. ఏ డ్రగ్ కు సంబంధించిన కంటైనర్ మీద అయినా తయారీ సంస్థ అంటించిన లేబుల్ తప్ప దానిపై మరో లేబుల్ ను అంటించకూడదు. కానీ రెమిడిసివర్ ఇంజక్షన్ బాటిల్ పై మందు తయారు చేసిన మైలాన్ సంస్థ లేబుల్ పై మరో లేబుల్ అంటించి ఉండడం కలకలం రేపుతోంది. ఈ రెండో లేబుల్ ను నెమ్మదిగా తీసి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఎక్సపైరీ డేట్ ను మార్చడానికి ఈ కొత్త లేబుల్ ను అంటించారు.
ఇలాంటి ఇంజెక్షన్లు తీసుకోవడంతోనే నర్సీపట్నం ఆసుపత్రిలో చిటికెల తాతమ్మ నాయుడు, ఎ. సన్యాసిరావు, ఎస్.అరుణ్ చంద్ అనే ఈ ముగ్గురు మరణించారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. వీరిలో చిటికెల తాతమ్మ నాయుడు జర్నలిస్ట్.
ఇదీ చదవండి: ఏపీలో ఇళ్లు లేని పేదవాడు ఉండొద్దు.. కేసులకు భయపడేది లేదన్న ఏపీ సీఎం జగన్
వీరు ముగ్గురు రెమ్డెసివిర్ ఇంజక్షన్ తీసుకున్నట్టు ఆసుపత్రి రిజిస్టర్ లో నమోదైంది. ఇంజెక్షన్లను ఎప్పుడు ఏ పేషంటుకు ఇచ్చారో, ఎన్నో డోస్ అన్న పూర్తి వివరాలు రిజిస్టర్ లో ఉన్నాయి. అక్కడ రోగులకు ఇచ్చినవాటిలో ఎక్కువగా ఎక్సపైరీ డేట్ అయిపోయిన రెమ్డెసివిర్ ఇచ్చి ఉంటారని స్థానికులు, విపక్ష నేతలు అనుమానిస్తున్నారు. అయితే కొంతమందికే ఇలా ఇచ్చారా, లేక అందరికీ ఇలా ఎక్సపైరీ డేట్ అయిపోయిన రెమ్డెసివిర్ ఇచ్చారా అన్నదానిపై దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమవారికి గడువు ముగిసిన రెమిడీసివర్ ఇంజక్షన్లు ఇచ్చారని.. కాలం చెల్లిన మందులతో బలితీసుకున్నారంటూ బాధితులు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి దగ్గర అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బందిని రోగులు బంధువులు నిలదీశారు.
ఇదీ చదవండి: సెంచరీ నాటౌట్.. ఏపీని భయపెడుతున్న పెట్రోల్ డీజల్ ధరలు.. ఏ జిల్లాలో ఎంత?
నర్సిపట్నం జనరల్ హాస్పిటల్లో రోగులకు గడువు ముగిసిన రెమిడీసివర్స్ ఇవ్వడంతో, కోపంతో ఉన్న రోగుల బంధువులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి ఫార్మసీ విభాగానికి చేరుకుని సంబంధిత అధికారులను స్టాక్ చూపించాలని డిమాండ్ చేశారు. దీంతో హాస్పిటల్ లో గొడవ జరుగుతున్న విషయం నర్సీపట్నం పోలీసులకు చేరడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, భాదిత సభ్యులను టీడీపీ నేతలను అడ్డుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను, అక్కడ ఉన్నవారిని అక్కడినుండి చెదరగొట్టారు. అధికారులతో మాట్లాడి విషయం తేల్చుకోవాలని పంపించారు.
ఇదీ చదవండి: ఆనందయ్య ముందు పంపిణీ ఎప్పుడంటే.. వెబ్ సైట్ ద్వారా ఇతర జిల్లాలకు మందు
ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద కుంభకోణం ఉందని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం కోసం కొంతమంది
డ్రగ్ తయారీ కంపెనీలతో ఒప్పందం ఏర్పాటు చేసుకున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎక్స్పెయిరీ అయిపోయిన మందులు పేషెంట్లకు అందిస్తున్నారని పలువురు రోగుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గడువు తీరిన మందును స్టిక్కర్లు అంటించి ఏవిధంగా పంపిణీ చేస్తారని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ ని ఫోన్లో ప్రశ్నించగా.. జిల్లా వైద్యశాఖ అధికారి డిఎంహెచ్వో ద్వారా వచ్చాయని, ఈ మందులు మాత్రమే వాడమని ఆదేశాలు జారీ చేశారంటున్న సూపరింటెండెంట్ బంధువులకు ఫోన్లో సమాధానం ఇచ్చారు.
ఇక నర్సీపట్నంలో కాలం చెల్లిన రెమిడిసివిర్ ఇంజక్షన్ల విషయంపై జిల్లా వైద్య శాఖ అధికారిని ఫోన్ లో ప్రశ్నించగా.. ప్రభుత్వం అదే మందులు జారీ చేసిందని తమ దగ్గర ఆర్డర్ కాపీ ఉందని డీఎంహెచ్వో నుండి సమాధానం వచ్చింది. జిల్లా మొత్తం కూడా ఈ కాలం చెల్లిన మందుల పై స్టిక్కర్లు వేసి పంపిణీ చేస్తున్నట్టు అనుమానాలు పెరుగుతున్నాయి. ఫోన్ చేసిన వ్యక్తి పై చిరాకుగా మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేస్తూ... ప్రజల ప్రాణాలు కాపాడడానికి వచ్చాడండి మగాడు అంటూ డీఎంహెచ్వో వెటకారంగా మారారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెల నాటికి కాలం చెల్లిన మందులు జిల్లా అంతా పంపిణీ చేశారంటే, ఇందులో ఎంతమంది అధికారులు, ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా ఎలా జరిగింది? నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది బయటకు వచ్చింది సరే.. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ప్రభుత్వ ఆసుపత్రుల లోనూ ఇలాగే జరిగిందా? ప్రైవేటు ఆసుపత్రుల లోనూ ఇదే జరిగి ఉంటుందా? ఈ నకిలీ మందు వాడి ఇంకా ఎంతమంది కరోనా పేషంట్లు మృత్యువాత పడ్డారు? ఏపీలో మరణాల రేటు ఎక్కువగా ఉండటానికి ఈ స్కామ్ కారణమా? ఈ స్కామ్ వెనుక ఉన్నది చాలా పెద్ద తలకాయలే ఉన్నారని స్పష్టం అవుతోందని బాధితులు, స్ధానిక టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ వంటి ముఖ్యమైన డ్రగ్ ను నకిలీ చేయడం... దాన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అందించడం మామూలు వ్యక్తులతో అయ్యే పని కాదు. ప్రభుత్వ ఆసుపత్రులలో వాడే మందులు డ్రగ్ ఇన్స్పెక్టర్లు, డ్రగ్ కంట్రోలర్ లు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మొదలైన వారందరి పరీక్షలను దాటి రావాలి. ప్రతి మందుకూ, ప్రతీ ఇంజెక్షన్లకూ వాటి బ్యాచ్ నెంబర్లు నమోదు చేయబడి ఉంటాయి. ఇందులో ఎక్స్పెయిరీ అయిపోయిన మందులను తయారీ సంస్థకు తిప్పి పంపేందుకు కూడా ఒక ప్రొటోకాల్ ఉంటుంది. అందులోనూ రెమ్డెసివిర్ ఇంజక్షన్ అనేది హెవీ ప్రోటోకాల్ ఇంజక్షన్. ఇలాంటి మందు నకిలీ అయ్యిందంటే... ఈ స్కాములో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభావితం చేయగల శక్తులు ఉన్నాయన్నది స్పష్టం అవుతోందని స్ధానిక టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, CORONA MEDICINE, TDP, Visakha, Visakhapatnam, Vizag