ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు పెరగడానికి వైసీపీ నేతలు ప్రధాన కారణం అని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. కరోనాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేలిగ్గా తీసిపారేశారని, అధికారులు కూడా ఎటువంటి జాగ్రత్తలు చెప్పకపోవడంతో ప్రజలకు వ్యాధి తీవ్రత పెద్దగా తెలియలేదన్నారు. ఎన్నికలు వస్తాయి వస్తాయి అని చెప్పి వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్టు బయట తిరిగారని, వారి చుట్టూ అధికారులు తిరగడం వల్ల ప్రజా సమస్యలపై దృష్టి పెట్టలేకపోయారని అఖిలప్రియ అన్నారు. స్థానిక ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతో కరోనా కేసులను బయటకు రానీయకుండా ఈ ప్రభుత్వం ఆపేసిందని అఖిలప్రియ ఆరోపించారు. చనిపోయిన వారి వివరాలు తెలియనివ్వలేదని, ఎవరికి టెస్ట్ లు చేస్తున్నాం, ఎన్ని కిట్లు అందుబాటులో ఉన్నాయనే వివరాలు బయటకు రానివ్వకుండా అధికారులను ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకుని ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు.
ప్రజల ప్రాణాల కోసం వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని, ఇవేమీ పట్టని ఈ ప్రభుత్వం కళ్లు మూసుకుని రాజకీయం చేస్తోందని భూమా అఖిలప్రియ ఆరోపించారు. అనంతపురంలో ఏఎస్ఐ చనిపోయారని, ఎమ్మార్వో కు కరోనా వచ్చిందని చెప్పారు. ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రైతులను ఆదుకుంటామని జీవోల మీద జీవోలు ఇస్తున్నారు. కానీ కార్యచరణలో పెట్టడం లేదు. లాక్ డౌన్ సమయంలో మార్కెట్ యార్డుల దగ్గర పాయింట్లు పెడుతున్నారు. దీని వల్ల రైతులు పెద్ద ఎత్తున యార్డులకు రావడం వల్ల కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని అఖిలప్రియ ఆందోళన వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bhuma Akhilapriya, Coronavirus, Covid-19, Kurnool