news18-telugu
Updated: November 12, 2020, 10:52 PM IST
ప్రతీకాత్మక చిత్రం
కరోనా పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షల రేట్లను తగ్గించింది. ప్రైవేటు ల్యాబరేటరీల్లో కోవిడ్ 19 పరీక్షలకు వసూలు చేసే ధరల్ని సవరించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ఏబీఎల్, ఐసీఎంఆర్ లు అనుమతించిన ప్రైవేట్ ల్యాబరేటరీల్లో పరీక్షలకు వసూలు చేసే ధరలను సవరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఎన్ఏ కిట్లు, ఆర్టీపీసీఆర్ కిట్లు మార్కెట్లో పూర్తిగా అందుబాటులోకి రావటంతో పరీక్షల కోసం వసూలు చేస్తున్న ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించింది.
ప్రభుత్వం పంపించే నమూనాలకు రూ. 800 మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక వ్యక్తిగతంగా శాంపిల్స్ తీసుకొచ్చే వారి నుంచి రూ. 1000 వరకూ వసూలు చేసుకోవచ్చని తెలిపింది. ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఏపీలో కరోనా కేసుల సంఖ్య మరింతగా తగ్గుతోంది. రాష్ట్రంలో కొత్తగా 1,728 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 849705కి చేరింది. ఇందులో 822011 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 20857 కేసులు ఇంకా యాక్టివ్గా ఉన్నాయి.
ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6837కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా 77148 మంది కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఏపీలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 8940488కు చేరుకుంది. కొత్తగా తూర్పు గోదావరి జిల్లాలో 290, పశ్చిమ గోదావరిలో 239, కృష్ణాలో 223, గుంటూరు 212, చిత్తూరు 206, అనంతపురం 99, నెల్లూరు 91, ప్రకాశం 88, విశాఖ 74, కడప 85, విజయనగరం 42, కర్నూలు 36 శ్రీకాకుళం 43 కేసులు నమోదయ్యాయి.
Published by:
Kishore Akkaladevi
First published:
November 12, 2020, 10:52 PM IST