గత కొంతకాలంగా ఏపీని భయపెట్టిన కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వందల్లోనే కేసులు ఉంటున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే 50 లోపే కొత్తగా కేసులు రికార్డు అవుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల మినాహా అన్నిచోట్ల నిలకడగా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. ఏపీలో గడిచిన 24 గంటల్లో 69,088 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో కొత్తగా 1,535 మందికి కరోనా సోకింది. మరోవైపు గత వారంతో పోలిస్తే మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా16 మంది మృతి చెందారు. కేసుల సంఖ్య తగ్గడానికి తోడు తాజాగా 2,075 మంది కరోనా బాధితులు రికవరీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,55,95,949 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 19,60,350 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. అంతేకాకుండా కరోనా మహమ్మారి బారినపడి మొత్తం 13,631 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,210 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 19,92,191 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ప్రస్తుతం కేసులు తగ్గడంతో ఏపీ వ్యాప్తంగా అమలు అవుతున్న నైట్ కర్ఫ్యూను కూడా ఎత్తివేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర్ర వ్యాప్తంగా రాత్రి పది గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. అయితే కొన్ని జిల్లాల్లోని వివిధ మండలాల్లో ఎక్కువగా కేసులు నమోదైతే.. ఆ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి అక్కడ మాత్రమే లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇకపై ఏపీ వ్యాప్తంగా కర్ఫ్యూను లిఫ్ట్ చేసి.. కంటైన్మెంట్ ప్రాంతాల్లో మాత్రమే కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయం తీసుకునట్టు తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది..
మరోవైపు ఏపీలో కరోనా కట్టడి చర్యలపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఇక్కడ చర్యలను కొనియాడారు. ప్రభుత్వ చర్యల వల్ల ఏపీలో కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ‘‘ఎస్వోపీ పాటించడంపైనే థర్డ్వేవ్ ఆధారపడి ఉంటుందన్నారు. పిల్లలపై థర్డ్వేవ్ ప్రభావం చూపుతుందనడానికి ఆధారాలు లేవని.. ఇప్పటికే చాలామంది పిల్లలు వైరస్ బారినపడి రికవరీ అయ్యారని గుర్తు చేశారు. కోవిడ్ను ఎదుర్కోవడానికి మాస్క్, టీకా తప్ప మరో మార్గం లేదన్నారు ఆయన.
అయితే ఏపీలో వ్యాక్సినేషన్ విజయవంతంగా నిర్వహించడంతో కరోనా కట్టడి అవుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 5.76 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను కేంద్రం కేటాయించింది. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వ్యాక్సిన్లు చేరుకున్నాయి. వీటిని వైద్య అధికారులు గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వీటిని సరఫరా చేయనున్నారు. ఏపీకి అదనపు వ్యాక్సిన్ డోసులు అందడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Corona alert, Corona bulletin, Corona vaccination centres, Covishield