వైరస్ నియంత్రణలో భాగంగా త్వరలో చేపట్టనున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా జరిగేలా సంబంధిత శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సీఎం కాన్పరెన్సు హాల్లో సీఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి చేపట్టాల్సిన వివిధ ఏర్పాట్లపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తొలివిడతలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ కేర్ సిబ్బందితో పాటు ఐసీడీఎస్ వర్కర్లు కలిపి 3లక్షల 70వేల మంది హేల్త్కేర్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే కేంద్ర రాష్ట్ర పోలీసులు, సాయుధ బలగాలు ,హోంగార్డు, జైళ్ల సిబ్బంది, విపత్తుల నిర్వహణ సంస్థ వాలంటీర్లు, సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్, మున్సిపల్ వర్కర్లు, రెవెన్యూ సిబ్బందితో కలిపి 9లక్షల మందికి వ్యాక్సిన్లు వేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే, 50 యేళ్ళ వయస్సు నిండి చక్కెర వ్యాధి, హైపర్ టెన్సన్, క్యాన్సర్ ఊపిరి తిత్తులు వ్యాధితో ఇబ్బంది పడే వారికి కూడా తొలి విడత ఇంజక్సన్లు వేయడంలో ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు. అయితే, మొదటి ప్రాధాన్యతా క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు లేదు. ప్రభుత్వం అత్యవసరంగా భావిస్తే జగన్ మోహన్ రెడ్డికి వేయవచ్చు. అలాగే, ఆయన వయసు కూడా 50 ఏళ్ల కంటే తక్కువ కాబట్టి, మొదట హెల్త్ కేర్ వర్కర్లకు ప్రాధాన్యం ఇచ్చి, ఆ తర్వాత మిగిలిన ముఖ్యులకు వేస్తారు.
రాష్ట్ర స్థాయిలో సీఎస్ అధ్యక్షతన వైద్య ఆరోగ్య,హోం శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు మరికొందరు కార్యదర్శులతో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ నెలకు ఒకసారి సమావేశమై కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఎప్పటికప్పడు సమీక్షిస్తుందని సీఎస్ పేర్కొన్నారు. అలాగే జిల్లా స్థాయిలో కలక్టర్ అధ్యక్షతన జిల్లా ఎస్పీ వైద్య ఆరోగ్య తదితర శాఖలతోను, మండల స్థాయిలో తహసీల్దార్ అధ్యక్షతన, మున్సిపాలిటీ స్థాయిలో మున్సిపల్ కమీషనర్ అధ్యక్షతన సంబంధిత శాఖలతో ఏర్పాటు చేసిన టాస్కు ఫోర్సు కమిటీలు వారానికి ఒకసారి సమావేశమై ఇందుకు సంబంధించిన వివిధ అంశాలను సమీక్షిస్తాయని సిఎస్ చెప్పారు. అంతేగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఫిర్యాదులు, సూచనలు, సలహాలు తీసుకుని వాటిని సత్వరం పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో 24గంటలూ పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ నిల్వ, సరఫరా, కోల్డు చైన్ నిర్వహణ, ఐస్ బాక్సులు, ప్రీజర్లు, వ్యాక్సిన్ క్యారియర్స్ తదితర అంశాలపై చేపట్టాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎస్ ఆదిత్యానాధ్ దాస్ సమీక్షించారు. తొలి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి, ఇంకా డిమాండుకు అనుగుణంగా కావాల్సిన సహాయ సహకారాలపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడామని సీఎస్ చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లకు ఆవకాశం లేకుండా కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా సజావుగా జరిగేలా వివిధ శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు.