ప్రపంచవ్యాప్తంగా కొత్త కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతోంది. యూకేలో పుట్టిన కొత్త స్ట్రెయిన్ ఇతర దేశాలకూ విస్తరిస్తోంది. ఇప్పటికే మనదేశంలో పలువురు ఈ వైరస్ బారినపడ్డారు. తాజాగా రెండేళ్ల బాలికకు కూడా యూకే వైరస్ నిర్ధారణ అయింది. మీరట్కు చెందిన ఓ ఫ్యామిలీ ఇటీవలే యూకే నుంచి ఇండియాకు తిరిగొచ్చింది. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అది కొత్త స్ట్రెయినా? కాదా ? అని తెలుసుకునేందుకు శాంపిల్స్ను పుణె వైరాలజీ ల్యాబ్కు పంపించారు. ఐతే ఆ కుటుంబంలోని రెండేళ్ల పాప శాంపిల్స్లో యూకే వైరస్ బయటపడింది. కానీ మిగతా కుటుంబ సభ్యుల్లో మాత్రం కొత్త వైరస్ ఆనవాళ్లు కనిపించలేదు. బాధితులు మీరట్లోని టీపీ నగర్ ప్రాంతానికి చెందిన వారిగా అధికారులు చెప్పారు.
కొత్త రాకతో మీరట్ అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. బాధితుల చుట్టు పక్కల పరిసరాలను సీల్ చేశారు. ఇంతకు ముందు మనదేశంలో ఆరు కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులోని NIMHANSలో మూడు, హైదరాబాద్ CCMBలో రెండు, పుణె NIVలో ఒక పాజిటివ్ కేసు నమోదయింది. రోజు రోజుకూ కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ఎప్పటిలాగే మాస్క్లు ధరించి.. భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. అజాగ్రత్తగా ఉండడం ఎంత మాత్రమూ మంచిది కాదని చెబుతున్నారు.
వాక్సిన్ వస్తోంది.. కరోనా వైరస్ పీడ విరగడయింది.. అని అందరూ అనుకుంటున్న సమయంలోనూ యూకేలో కొత్త రకం కోవిడ్ బయటపడింది. సాధారణ వైరస్ కంటే 70శాతం అధికంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్ నుంచి సంబంధాలను తెంచుకున్నాయి. విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేశాయి. యూకే తర్వాత పలు దేశాల్లోనూ కొత్త రకం కరోనా వైరస్ బయటపడుతోంది. దాంతో పలు దేశాలు మళ్లీ లాక్డౌన్ దిశగా వెళ్తున్నాయి. కొత్త వైరస్ నేపథ్యంలో భారత అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి ఆర్టీ పీీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ వస్తే ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స అందిస్తున్నారు. నెగెటివ్ వచ్చినా క్వారంటైన్లో ఉంచుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:December 30, 2020, 07:31 IST