
Yes Bank : యెస్ బ్యాంక్ చీఫ్ రానా కపూర్ అరెస్ట్... నెక్ట్స్ ఏంటి?
Yes Bank : రానా కపూర్ అరెస్టుతో యెస్ బ్యాంక్ సంక్షోభం మరో మలుపు తిరిగినట్లైంది. రానా... విదేశాలకు అక్రమంగా డబ్బును తరలించినట్లు ఆరోపణలున్నాయి.
Yes Bank | Mumbai : యెస్ బ్యాంక్ బాధితులు ఆరోపిస్తున్నట్లే అంతా జరుగుతోందా... బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్ అరెస్టుతో... కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే అరెస్టు చేసింది పోలీసులు కాదు.... ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED). డబ్బు అక్రమ మార్గంలో విదేశాలకు తరలిన కేసుల్లోనే ఈజీ జోక్యం చేసుకుంటుంది. ఇదే నేరానికి రానా కపూర్ పాల్పడినట్లుగా ఈడీ కేసు రాసింది. యెస్ బ్యాంకులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై రెండ్రోజులుగా ఈడీ అధికారులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ముంబైలోని ఆయన ఇంట్లో చెక్ చేశారు. తర్వాత ఆయన్ని ఈడీ ఆఫీస్కి తీసుకెళ్లారు. 20 గంటలు ప్రశ్నించారు. ఆదివారం అరెస్టు చేశారు. విచారణలో రానా కపూర్ సరిగా సమాధానాలు చెప్పట్లేదని అధికారులు తెలిపారు. కోర్టు ద్వారా కస్టడీకి తీసుకొని ప్రశ్నించడం ద్వారా నిజాలు రాబట్టాలని అధికారులు భావిస్తున్నారు. DHFL సహా మరో కార్పొరేట్ కంపెనీకి ఇచ్చిన అప్పుల విషయంలో కపూర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. యెస్ బ్యాంక్ సంక్షోభంలో కూరుకుపోవడానికి దారితీసిన కొన్ని అవకతవకల్లోనూ ఆయన పాత్ర ఉన్నట్లు తెలిసింది. తాజాగా యెస్ బ్యాంక్... డెబిట్ కార్డుల ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చని తెలిపింది. ఎందుకంటే... మూడ్రోజులుగా బ్యాంక్ కస్టమర్లు... మనీ విత్ డ్రా చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సహా ATMల నుంచి డబ్బులు రాలేదు. యెస్ బ్యాంక్పై మారటోరియం విధిస్తూ... విత్డ్రాలపై రూ.50వేల పరిమితిని విధించడంతో ఈ సమస్యలు వచ్చాయి. ఇప్పుడు మనీ వస్తుండటంతో... కస్టమర్లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
Published by:Krishna Kumar N
First published:March 08, 2020, 10:42 IST