ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) తన మొత్తం బ్రాంచ్ల (Branches) సంఖ్యను భారీగా తగ్గించేందుకు సిద్ధమైనట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. ఈ బ్యాంక్కి మార్చి 2022 చివరి నాటికి 4,528 బ్రాంచ్లు ఉన్నాయి. డిసెంబర్ 2021 త్రైమాసికంతో పోలిస్తే ఈ సంఖ్య పెరగలేదు, తగ్గలేదు. మార్చి 2023 చివరి నాటికి నష్టాల్లో ఉన్న శాఖలను మూసివేయడం (Closing) లేదా విలీనం (Merging) చేయడం ద్వారా బ్యాంకు తన 600 బ్రాంచ్లను తగ్గించాలని లేదా బ్రాంచ్ల మొత్తంలో 13 శాతం తగ్గించాలని చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే, ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY23) ఎన్ని బ్రాంచ్లను మూసివేయాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీబీఐ ఒక అధికారిక స్టేట్మెంట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఇది ఏప్రిల్ 2017 - డిసెంబర్ 2021 మధ్యకాలంలో దాని 186 బ్రాంచ్లను తగ్గించింది.
ఈ బ్యాంక్లో జూన్ 2017 నుంచి అధికంగా నికర నిరర్థక ఆస్తులు (Non Performing Assests-NPA) పోగుపడ్డాయి. ఈ బ్యాంక్ ఆస్తులపై ప్రతికూల రాబడి మాత్రమే మిగిలింది. దీనితో ఆర్బీఐ ఈ బ్యాంకును సత్వర దిద్దుబాటు చర్య (Prompt Corrective Action-PCA) పరిపాలన విధానంలో చేర్చింది. “సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలను మూసివేయడం గురించి ప్రెస్/మీడియాలో నివేదించడం జరిగింది. నిజానికి ఫైనాన్షియల్ ఇయర్ 2022-23లో పెద్ద సంఖ్యలో బ్రాంచ్లను క్లోజ్ చేయాలని ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మేం తెలియజేస్తున్నాం" అని శనివారం ఓ ప్రకటనలో ఆ బ్యాంక్ విస్పష్టం చేసింది. అయితే కార్పొరేట్ వ్యాపార లక్ష్యాలను సాధించడానికి ప్రతి బ్యాంకు క్రమం తప్పకుండా తన బ్రాంచ్లను షిఫ్ట్ చేయడం లేదా విలీనం చేయడం లేదా మూసివేయడం లేదా తెరవడం అనేది ఒక కామన్ ప్రాక్టీస్ అని పేర్కొంది. "మా కస్టమర్లు, ఇతర వాటాదారులందరి వడ్డీకి హామీ ఇస్తున్నాం." అని భరోసా ఇచ్చింది.
2022 ఫైనాన్షియల్ ఇయర్ నాలుగో త్రైమాసికంలో బ్యాంక్ రూ.310 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అయితే గతేడాది మార్చి 2021తో ముగిసిన త్రైమాసికంలో రూ.1,349 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఫైనాన్షియల్ ఇయర్ 2022 మాత్రం సీబీఐ నికర లాభం రూ.1,045 కోట్లగా నమోదు కావడం విశేషం. ఫైనాన్షియల్ ఇయర్ 2021లో లాభం రాకపోగా బ్యాంకుకు రూ. 888 కోట్ల నష్టం వచ్చింది. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎం.వీ రావు మాట్లాడుతూ, సీబీఐ బ్యాంక్ పీసీఏ పారామితులను పాటిస్తోందని... ఆడిట్ చేసిన ఫలితాలను ఆర్బీఐకి సమర్పిస్తుందని చెప్పారు. పీసీఏ పాలన నుంచి వైదొలగాలని ఆర్బీఐకి అభ్యర్థన కూడా చేస్తుందన్నారు.
మార్చి 2022 త్రైమాసికంలో బ్యాంక్ ఎన్ఐఐ (Net Interest Income) 59.43 శాతం పెరిగి రూ. 2,417 కోట్లకు చేరుకుంది, ఇది ఏడాది క్రితం రూ.1,516 కోట్లుగా ఉంది. ఎఫ్వై21 క్యూ4లో రూ.1,986 కోట్ల నుంచి ఎఫ్వై22 క్యూ4లో కేటాయింపులు 42.09 శాతం తగ్గి రూ.1,150 కోట్లకు పడిపోయాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో (PCR) 82.54 శాతం నుంచి 86.69 శాతానికి మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తులు (gross NPAs) క్షీణతతో దాని ఆస్తి నాణ్యత మెరుగుపడింది. ఈ నాన్- పర్ఫామింగ్ అసెట్స్ ఏడాది క్రితం 16.55 శాతం నుంచి మార్చి 2022లో 14.84 శాతానికి చేరుకున్నాయి. మార్చి 2022లో నికర NPAలు 3.97 శాతంగా ఉన్నాయి, ఇది ఏడాది క్రితం 5.77 శాతంగా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banking news, Central bank, Central Bank of India, Rbi