సాధారణంగా చాలామంది డబ్బును బ్యాంకుల్లో (Banks) దాచుకుంటారు. సేవింగ్స్ అకౌంట్ రూపంలో, డిపాజిట్ల రూపంలో చాలామంది వివిధ బ్యాంకుల్లో పొదుపు చేస్తుంటారు. అయితే డాపాజిట్లు సేకరించే బ్యాంకు దివాలా తీస్తే పరిస్థితి ఏంటనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? బ్యాంకు ఉన్నట్టుండి మూతపడితే మీరు పొదుపు చేసిన డబ్బులు నష్టపోయినట్టేనా? భారత్లో బ్యాంకులు దివాలా తీస్తే డిపాజిటర్లకు పరిహారం చెల్లించే సదుపాయం ఉందా? అనే విషయాలను తెలుసుకుందాం.
* రూ.5 లక్షల కవరేజీ
బ్యాంకు దివాలా తీసిన సందర్భాల్లో ఖాతాదారులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పిస్తోంది. బ్యాంకులు దివాలా తీసిన సందర్భాల్లో అకౌంట్ హోల్డర్లు నష్టపోకుండా ఉండటానికి రిజర్వ్ బ్యాంకు రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పిస్తోంది. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్ , ఫిక్స్డ్ డిపాజిట్, పర్మినెంట్ డిపాజిట్.. ఇలా తదితర రూపాల్లో బ్యాంకుల్లో పొదుపు చేసిన వారికి ఈ ఇన్సూరెన్స్ అమలవుతుంది.
* ఆ బ్యాంకులకు వర్తింపు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(Deposit Insurance and Credit Guarantee Corporation) ఖాతాదారులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. గుర్తింపు పొందిన అన్ని బ్యాంకుల అకౌంట్ హోల్డర్లు బీమా సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఎన్ని బ్యాంకుల్లో అకౌంట్ ఉన్నా, వాటిపై ఈ ఫెసిలిటీ వర్తిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే వీలుండదు.
ఇది కూడా చదవండి : ఇన్కం ట్యాక్స్ ఎక్కువ చెల్లిస్తున్నారా.. పన్ను భారం ఇలా తగ్గించుకోండి!
* వీటికి ఇన్సూరెన్స్ ఉండదు..
ఇతర దేశాల ప్రభుత్వాలు చేసే డిపాజిట్లపై డీఐసీజీసీ ఇన్సూరెన్స్ కల్పించట్లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డిపాజిట్లకు ఈ బీమా ఉండదు. ఇంటర్బ్యాంక్ రెమిటెన్సెస్ క్రెడిట్ అయిన సందర్భాల్లో వర్తించదు. రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకుతో జరిపే స్టేట్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ డిపాజిట్లు కూడా ఈ ఇన్సూరెన్స్ పరిధిలోనికి రావు. విదేశాల్లో చేసిన చెల్లింపుల మొత్తంపై కూడా డీఐసీజీసీ ఇన్సూరెన్స్ని అమలు చేయట్లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిన మొత్తంపై ఆయా సంస్థలు ఇచ్చే మినహాయింపులకు కూడా ఈ ఇన్సూరెన్స్ వర్తించదు.
* రూ.5లక్షలు సరిపోతాయా?
బ్యాంకుల్లో చాలామంది పెద్దమొత్తంలో జమ చేసుకుంటారు. దీంతో బ్యాంకులు దివాలా తీస్తే రూ.5లక్షల మాత్రమే ఇన్సూరెన్స్ ఇవ్వడం సమంజసం కాదని అకౌంట్ హోల్డర్లు వాపోతున్నారు. ముఖ్యంగా, సీనియర్ సిటిజన్లు బ్యాంకుల్లో చేసే డిపాజిట్లపైనే ఆధారపడుతుంటారు. దీంతో ఇన్సూరెన్స కవరేజీ పెంచాలని, కోల్పోయిన మొత్తాన్ని తిరిగి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
* ఇప్పుడు ప్రస్తావనెందుకు..?
అమెరికాలో రెండు బ్యాంకులు దివాలా తీశాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ యాజమాన్యాలు చేతులెత్తేశాయి. దీంతో ఉన్నట్టుండి ఇతర దేశాల అకౌంట్ హోల్డర్లలో భయం మొదలైంది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. అకౌంట్ హోల్డర్లకు హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కోల్పోయిన డబ్బును తిరిగి వారి ఖాతాల్లోకి జమ చేసేలా చూస్తామని చెప్పారు. బ్యాంకులు దివాలా తీయడం వల్ల ఖాతాదారులకు ఎలాంటి నష్టం ఉండబోదని ఫెడరల్ రిజర్వ్, ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Money, Personal Finance, Savings