ప్రస్తుత ప్రపంచంలో నిజాయతీకి చోటు ఉందా? ఈ ప్రశ్న అడిగితే ఎక్కువ శాతం మంది నుంచి లేదనే సమాధానమే ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి భావనను తొలగించడానికి కేరళ పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పాఠశాలలోనే విద్యార్థులకు నిజాయితీతో పాటు విలువల గురించి ఆచరణాత్మకంగా చెప్పేందుకు ‘హానెస్టీ షాప్స్(Honesty Shops)’ ప్రారంభించారు. ఇంతకీ ఆ షాప్స్ ఏంటి., విద్యార్థులు ఈ ప్రయోగంతో ఏం నేర్చుకుంటారని పోలీసులు ఆశిస్తున్నారనే విషయాలు తెలుసుకుందాం.
హానెస్టీ షాప్స్లో ఎవ్వరూ ఉండరు
మనిషి జీవితంలో విద్యార్థి దశ ఉన్నతమైంది. ఈ సమయంలో నేర్చుకున్న విషయాలే జీవితాంతం విద్యార్థిని నిలబెడతాయి. విలువలతో కూడిన విద్యను నేర్చుకుని విద్యార్థి ఉన్నత స్థాయికి వెళ్లాలని తల్లి దండ్రులు కోరుకుంటారు. మంచి పాఠశాలలను ఎంపిక చేసి అందులో చదివిస్తారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో విలువలను నేర్పించే శాతం తగ్గిపోయింది. విద్య వాణిజ్య పరమైంది. దీంతో విద్యార్థులకు నిజాయితీ, విలువలను నేర్పించాల్సిన ఆవశ్యకత ఉందని స్టూడెంట్ పోలీస్ క్యాడెట్(SPC) కేరళ రాష్ట్ర నోడల్ ఆఫీసర్, ఐపీఎస్ అధికారి పి.విజయన్ భావించారు. విద్యార్థుల్లో నిజాయితీని పెంపొందించే ప్రయత్నంగా ఎర్నాకులంలోని ఏడు పాఠశాలల్లో ‘హానెస్టీ షాప్స్’ ప్రారంభించారు.
ఈ షాప్స్ ప్రత్యేకతలివే
కేరళ పోలీసులు ఈ షాప్స్ను హై స్కూల్స్లో ప్రారంభించారు. ఇక ఈ దుకాణాల్లో పిల్లలకు సంబంధించిన స్టేషనరీ ఐటమ్లు అన్నిటినీ అందుబాటులో ఉంచారు. అయితే విద్యార్థులు ఈ షాపులోకి వెళ్లి తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. కానీ ఆ డబ్బులు తీసుకునేందుకు షాపులో ఎవ్వరూ ఉండరు. విద్యార్థులే నిజాయితీగా ఆయా వస్తువుల కొనుగోలుకు సరిపడా డబ్బులను ఆ షాపు బాక్సులో వేసి రావాలి. ఈ షాపును ఎస్పీసీ క్యాడెట్లు నిర్వహిస్తారు. ఆ డబ్బాలో వేసిన డబ్బులను సాయంత్రానికి కలెక్ట్ చేసి రిజిస్టర్లో ఎంట్రీ చేసి షాపు మూసివేసే ముందర ఇన్ఛార్జిగా ఉన్న టీచర్కు ఇవ్వాలి. దుకాణ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయలేదు. ఇలా విద్యార్థులకు నిజాయితీ, విలువల గురించి ఆచరణాత్మకంగా పోలీసులు తెలియజేస్తున్నారు. షాపులో స్టాక్ చాలా త్వరగా అయిపోతుందని, స్టూడెంట్స్ నిజాయితీగా వస్తువులకు డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారని పోలీసులు చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే ప్రయత్నం
ప్రస్తుతానికి ఏడు హై స్కూల్స్లో ఏర్పాటు చేసిన ‘హానెస్టీ షాప్స్’ను రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ప్రారంభించాలనే ఆలోచన ఉన్నట్లు పోలీసులు చెప్పారు. నిజాయితీ ఆవశ్యకత గురించి తెలిపేందుకు ఈ ప్రయోగం చేస్తున్నట్లు రామమంగళం హైస్కూల్ కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్ అనూబ్ జాన్ వివరించారు. గాంధీ జయంతి ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 6న ఈ షాప్స్ను ప్రారంభించినట్లు తెలిపారు. విజయన్ ఆలోచన నుంచి పుట్టిన ఈ ‘హానెస్టీ షాప్స్’ విద్యార్థుల్లో నిజాయితీ, విలువలు పెంపొందించేందుకు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.