ఆధార్ కార్డు... ప్రస్తుతం ఇది లేనిదే మనం ఏ పనీ చేయలేం. దేనికైనా ఆధార్ తప్పనిసరి. అయితే ఆ కార్డులో ఎమైనా మార్పులు చేయాలన్నా.. లేదా పిల్లలకు కొత్త కార్డు తీసుకోవాలంటే ఆ తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ముందు ఆధార్ సెంటర్లో (Aadhaar Center) స్లాట్ బుక్ చేసుకోవాలి. వారు అడిగిన ప్రూఫ్లు తీసుకువెళ్లాలి. వాటిల్లో ఏది లేకపోయినా అప్పటి వరకు పడిన ప్రయాస అంతా వృథానే. ఈ నేపథ్యంలో ఆధార్ సేవలను మరింత సులభతరం చేసే క్రమంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొన్ని సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది.
త్వరలో హాస్పిటల్స్లో పుట్టిన శిశువులకు అక్కడే ఆధార్ నంబర్ ఇచ్చి, కార్డు అందించేలా ఏర్పాట్లు చేస్తోంది UIDAI. దీని కోసం జననాల రిజిస్ట్రార్తో యూఐడీఏఐ అవగాహన కుదుర్చుకుంటోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు యూఐడీఏఐ సీఈఓ సౌరభ్ గార్గ్ మీడియాకు తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
Business Idea: రూ.10,000 పెట్టుబడితో ఇంట్లోనే వ్యాపారం... రూ.30,000 వరకు ఆదాయం
'దేశంలోని మేజర్ల జనాభాలో 99.7 శాతం మంది ఆధార్లో ఎన్రోల్ అయ్యి ఉన్నారు. అంటే 131 కోట్ల జనాభాకు ఎన్రోల్మెంట్ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో కొత్తగా జన్మిస్తున్న శిశువుల ఎన్రోల్మెంట్పై దృష్టి పెట్టాం. ప్రతి రోజూ 2- 2.5 కోట్ల శిశువులు దేశంలో జన్మిస్తున్నారు. ఈ క్రమంలో వారు పుట్టిన వెంటనే హాస్పిటల్లోనే ఆధార్ నంబర్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పుట్టిన శిశువులను ఒక ఫొటో తీసి ఆధార్ కార్డు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఐదేళ్లలోపు పిల్లలకు బయో మెట్రిక్ ఉండదు కాబట్టి.. ఆ శిశువు తల్లి, లేదా తండ్రి ఆధార్కు లింక్ చేస్తాం. ఆ పిల్లలు ఐదేళ్లు దాటే వరకు ఇదే కొనసాగుతుంది.' అని సౌరభ్ గార్గ్ వెల్లడించారు.
PAN Card: పాన్ కార్డులో ఈ వివరాలు లేవా? అయితే అది నకిలీ కార్డే
2010లో ఆధార్ ఎన్రోల్మెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలందరూ ఆధార్ తీసుకున్నారు. దేశంలోని 140 కోట్ల బ్యాంక్ అకౌంట్లకు 120 కోట్ల అకౌంట్లు ఆధార్తో అనుసంధానం అయి ఉన్నాయి. వీరిలో ఏటా దాదాపు 10 కోట్ల మంది ఆధార్ కార్డులో పేర్లు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ వంటి వాటిని అప్ డేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ సేవలను మరింత సులభంగా, సౌకర్యవంతంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని గార్గ్ చెప్పారు. ముఖ్యంగా నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. అవేంటంటే...
ప్రజలు ఇంట్లో ఉండి వారి కంప్యూటర్ లోనే ఆధార్ అప్ డేట్ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 1.5 లక్షల మంది పోస్ట్మెన్లు గ్రామ, గ్రామానికి వెళ్లి ఆధార్ అప్డేట్, ఎన్రోల్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 6.5 లక్షల గ్రామాల్లో 50,000 ఆధార్ సెంటర్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.
స్మార్ట్ఫోన్ నుంచి అన్ని రకాల సేవలు పొందేలా ఓ యాప్ను తీసుకొస్తున్నారు.
అంతే కాక ఆధార్ ను పాన్కార్డ్, మొబైల్ సిమ్ కార్డులు, రేషన్ కార్డులు, అన్ని రకాల బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వీటి కోసం యూఐడీఏఐ కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, మేషీన్ లెర్నింగ్ వంటి వాటి ద్వారా ఆధార్ ను మరింత సమర్థంగా, సౌకర్యవంతంగా, భద్రంగా ఉంచేందుకు ముందుకెళ్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.