తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Telangana Minister Harish Rao) తాజాగా కీలక ప్రకటన చేశారు. కొత్తగా పెన్షన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన అర్హులందరికీ నూతనంగా పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. ఇంకా అర్హత కలిగిన వారికి రేషన్ కార్డులను సైతం మంజూరు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రకటన ఒకటి రెండు నెలల్లోనే ప్రారంభం అవుతుందని వివరించారు హరీశ్ రావు. ఈ ప్రక్రియ మొత్తాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. ఇంకా సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని భావించే వారికి కూడా అండగా ఉంటామన్నారు. వారికి కూడా రుణాలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై హరీశ్ రావు నిప్పులు చెరిగారు. దేశంలో బీజీపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్నంత అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. బీజేపీ నేతలు హైదరాబాద్లో ఉండి బురద రాజకీయం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సంపద పెంచి పేదలకు పంచుతుందన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం పేదలను దోచి కార్పొరేట్లకు పంచుతోందంటూ విమర్శలు గుప్పించారు హరీశ్ రావు.
సంగారెడ్డిలో బస్తీ దవాఖానల ద్వారా మంచి వైద్యం అందుతుందని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా అన్నారు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు ప్రజల సుస్తీని పోగొట్టి, దోస్తీ దవాఖానగా మారాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఒకప్పటి లాగా లేవన్నారు. అవి పూర్తిగా మారిపోయాయన్నారు. పైసా ఖర్చు లేకుండా వైద్యం, పరీక్షలు, మందులు ప్రజలకు అందుతున్నాయన్నారు మంత్రి హరీశ్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయితే కేసీఆర్ కిట్ ఇచ్చి, అమ్మ ఒడి వాహన సేవలు అందించి, 13 వేల రూపాయలు ఇస్తున్నామన్నారు. పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలని కోరారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Harish Rao, Ration cards