స్టాక్ మార్కెట్కు సంబంధించిన వ్యవహారాలు సక్రమంగా జరిగేలా సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చర్యలు తీసుకుంటుంది. బ్రోకరేజీ కమీషన్ల కోసం కొన్ని బ్రేకరేజ్ హౌస్లు నిబంధనలు అతిక్రమిస్తున్నాయని ఈ రెగ్యులేటరీ గుర్తించింది. ముఖ్యంగా పెయిర్డ్ కాంట్రాక్ట్లను యాక్సెప్ట్ చేస్తున్నాయని ఆరోపించింది. పెయిర్డ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్లు అనేవి టూ లెడ్డ్ కాంట్రాక్ట్స్. ఇవి ఒకే ప్రొడక్ట్కు చెందిన రెండు వేర్వేరు ఆప్షన్ కాంట్రాక్ట్లపై, ఒకే స్ట్రైక్ ప్రైస్తో, ఒకే ఎక్స్పైరీ డేట్తో ప్లేస్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తాయి. దీంతో ఎన్ఎస్ఇఎల్(NSEL) పరంగా 'ఫిట్ అండ్ పెర్ఫెక్ట్' ప్రమాణాలను పాటించడంలో విఫలమైన ఐదు బ్రోకరేజ్ హౌస్లపై సెబీ చర్యలు తీసుకుంది. కమోడిటీ బ్రోకర్లుగా రిజిస్టర్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోకుండా కొన్ని హౌస్లను ఆరు నెలలు, కొన్నింటిని మూడు నెలల వరకు నిషేధించినట్లు సెబీ మంగళవారం తెలిపింది.
ఐదు బ్రోకరేజ్ హౌస్లపై చర్యలు
సెబీ చర్యలను ఎదుర్కొన్న బ్రోకరేజ్ హౌస్లలో ఇండియా ఇన్ఫోలైన్ కమోడిటీస్, ఆనంద్ రాఠి కమోడిటీస్, జియోఫిన్ కాంట్రేడ్ 6 నెలలు, ఫిలిప్ కమోడిటీస్, మోతీలాల్ ఓస్వాల్ కమోడిటీస్ బ్రోకర్ 3 నెలలు నిషేధం ఎదుర్కొంటున్నాయి. ఈ అంశానికి సంబంధించి సెబీ ఐదు వేర్వేరు ఆర్డర్లలో.. ఎన్ఎస్ఇఎల్ నిబంధనల పరంగా బ్రోకరేజ్ హౌస్లు నడుచుకోలేదని స్పష్టంగా తెలుస్తోందని తెలిపింది. ఈ సంస్థలు బహుశా బ్రోకరేజ్లను సంపాదించాలనే కోరికతో నడుస్తున్నాయని అభిప్రాయపడింది. వారి క్లయింట్లకు ప్రొడక్ట్ను యాక్సెస్ చేయడానికి ప్లాట్ఫారమ్ను అందించాయని, ప్రొడక్ట్ను సక్రమంగా నిర్వహించే వారి సామర్థ్యంపైనా అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొంది. ఐదు బ్రోకరేజీ సంస్థలు మధ్యవర్తుల నిబంధనల(Intermediaries Regulations)ను పాటించలేదని సెబీ పేర్కొంది.
గతంలో సెబీ ఆదేశాలను పక్కన పెట్టిన SAT
2019లో NSEL కేసులో ఈ బ్రోకర్లకు వ్యతిరేకంగా సెబీ ఉత్తర్వులు జారీ చేసింది. వారు కమోడిటీ బ్రోకర్లుగా కొనసాగడానికి ‘నాట్ ఫిట్ అండ్ ప్రాపర్’ అని ప్రకటించింది. సెబీ ఆదేశాలను బ్రోకర్లు SAT ముందు సవాలు చేశారు. ఈ ఏడాది జూన్లో సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్(SAT).. NSEL కేసులో ఐదు బ్రోకరేజ్ హౌస్లను ‘ఫిట్ అండ్ ప్రాపర్ పెర్సన్’ కాదని ప్రకటించిన సెబీ 2019 నాటి ఆర్డర్ను పక్కన పెట్టింది. ఈ విషయానికి సంబంధించి ఆరు నెలల లోపు మరో నిర్ణయం తీసుకోవాలని సెబీని ఆదేశించింది. బ్రోకర్లపై తమ ఫిర్యాదులోని అన్ని ఆరోపణలు, అంశాలను పరిగణనలోకి తీసుకోవడంలో రెగ్యులేటర్ విఫలమైందని పేర్కొంటూ NSEL(నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్) కూడా SATని సంప్రదించింది.
నిబంధనలు ఉల్లంఘిస్తున్న బ్రోకరేజ్ సంస్థలు
ఫార్వర్డ్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) నిబంధనలను ఉల్లంఘించిన NSEL ట్రేడింగ్ ప్లాట్ఫారమ్లో ఇల్లీగల్ పెయిర్డ్ కాంట్రాక్ట్స్లో బ్రోకరేజ్ సంస్థలు మునిగిపోయాయని రెగ్యులేటర్ గమనించింది. ఐదుగురు బ్రోకర్లు క్లయింట్లకు, ఇతర సంబంధిత సంస్థలకు నిధులు సమకూర్చడం వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఈ క్లయింట్ల నికర విలువ, ఆదాయ స్థాయికి నిధులు అసమానంగా ఉన్నాయని కూడా ఆరోపించింది. అలాగే బ్రోకర్లు ఇన్ హౌస్ ఎన్బీఎఫ్సీని దుర్వినియోగం చేశారని, అటువంటి ఎక్స్పోజర్ తీసుకునే సామర్థ్యం లేని క్లయింట్లకు నిధులు సమకూర్చారని ఆరోపించింది. ప్రొహిబిటెడ్ పెయిర్డ్ కాంట్రాక్ట్స్తో ట్రేడింగ్ చేసినందుకు బ్రోకర్లు సెబీ చర్యలను ఎదుర్కొన్నారు. ఈ ఉత్తర్వులు EOW (ఆర్థిక నేరాల విభాగం) నుంచి వచ్చిన నివేదిక, బ్రోకర్లపై NSEL దాఖలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా వెలవడ్డాయి.
2013 జులైలో NSEL తన ప్లాట్ఫారమ్లో పెయిర్డ్ కాంట్రాక్ట్స్ను గుర్తించింది. FCRA, NSELకు స్పాట్ ఎక్స్ఛేంజ్గా రిజిస్ట్రేషన్ మంజూరు చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తెలుసుకొంది. దీంతో ఎటువంటి తాజా ఒప్పందాలను ప్రారంభించకుండా చర్యలు తీసుకుంది. ఫలితంగా దాదాపు 13,000 మంది పెట్టుబడిదారులకు దాదాపు రూ.5,600 కోట్ల సెటిల్మెంట్ బాధ్యతలను ఎక్స్ఛేంజ్ తీర్చలేకపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sebi