రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మళ్లీ షాక్ ఇచ్చింది. రెపో రేట్ను (Repo Rate) 50 బేసిస్ పాయింట్స్ పెంచింది. దీంతో రెపో రేట్ 4.9 శాతానికి పెరిగింది. మే 4న ఆర్బీఐ రెపో రేట్ 40 బేసిస్ పాయింట్స్ పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లు (Interest Rates) పెంచింది. దీంతో నెల రోజుల్లోనే వడ్డీ రేట్లు 90 పైసలు పెరిగాయి. జూన్ మొదటివారంలో జరగబోయే ద్రవ్యపరపతి విధాన కమిటీ సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లు పెంచుతామని ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే వడ్డీ రేట్లు ఎంత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూశాయి. ఏకంగా 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లు పెంచడం షాక్ ఇచ్చింది.
ఏప్రిల్లో జరిగిన ద్రవ్యపరపతి విధాన కమిటీ సమీక్షా సమావేశంలో ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి మళ్లీ రెండు నెలల తర్వాతే వడ్డీ రేట్లు పెరుగుతాయని అప్పట్లో అందరూ అనుకున్నారు. కానీ మే 4న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు ఆకస్మికంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ రెపో రేట్ 40 బేసిస్ పాయింట్స్ పెంచుతున్నట్టు ప్రకటించారు.
PAN Card: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? రూ.1,000 ఫైన్ తప్పించుకోవడానికి ఇలా చేయండి
వడ్డీ రేట్లు పెంచాలా? తగ్గించాలా? స్థిరంగా ఉంచాలా? అన్న నిర్ణయాన్ని సాధారణంగా ద్రవ్యపరపతి విధాన కమిటీ సమీక్షా సమావేశంలో ఆర్బీఐ తీసుకుంటుంది. కానీ మే 4న ఆర్బీఐ గవర్నర్ ఆకస్మికంగా వడ్డీ రేట్లను పెంచుతారని ఎవరూ ఊహించలేదు. రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ కంఫర్ట్ జోన్ కంటే ఎక్కువగా ఉందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.
కరోనా వైరస్ మహమ్మారి, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆర్బీఐ దశలవారీగా 250 బేసిస్ పాయింట్స్ అంటే 2.50 శాతం వడ్డీ రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేందుకు వడ్డీ రేట్లు పెంచడం వైపు ఆర్బీఐ మొగ్గు చూపింది. అందుకే మే 4న 40 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లు పెంచింది. ఇప్పుడు ద్రవ్యపరపతి విధాన కమిటీ సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లు మళ్లీ పెంచింది.
India Post: ఆ అకౌంట్ ఉన్నవారికి ఇండియా పోస్ట్ షాక్... వడ్డీ రేటు తగ్గింది
ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలకు వసూలు చేసే వడ్డీని రెపో రేట్ అంటారు. రెపో రేట్ పెరిగితే బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రుణాల వడ్డీ రేట్లు పెంచుతాయి. దీంతో కస్టమర్లకు ఈఎంఐ భారం అవుతుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఇతర రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారికీ ఎక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఫలితంగా ఈఎంఐలు భారం అవుతాయి.
ముఖ్యంగా హోమ్ లోన్లు ఆర్బీఐ రెపో రేట్కు లింక్ అయి ఉంటాయి కాబట్టి హోమ్ లోన్ భారం కానుంది. ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ సెక్టార్ పైన ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునేవారిలో రెపో రేట్ లింక్డ్ లెండింగ్ రేట్ ఎంచుకుంటూ ఉంటారు. రెపో రేట్ తగ్గితే ఈ వడ్డీ తగ్గుతుంది. రెపో రేట్ పెరిగితే ఈ వడ్డీ పెరుగుతుంది.
ఉదాహరణకు హోమ్ లోన్ కస్టమర్ రెపో రేట్ లింక్డ్ లెండింగ్ రేట్ ఎంచుకొని 7.5 శాతం వడ్డీతో హోమ్ లోన్ తీసుకున్నారనుకుందాం. ఇప్పుడు 50 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ పెరిగింది కాబట్టి వడ్డీ 8 శాతంగా లెక్కిస్తారు. దీంతో ఇప్పటికే చెల్లిస్తున్న హోమ్ లోన్ ఈఎంఐ కాస్త పెరుగుతుంది. అయితే వెంటనే కాకపోయినా మూడు నెలలకు ఓసారి వడ్డీ రీసెట్ చేస్తారు కాబట్టి త్వరలోనే ఈఎంఐ భారం అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loan, Home loan, Personal Finance, Personal Loan, Rbi, Reserve Bank of India