ఉక్రెయిన్ (Ukraine), రష్యా (Russia) యుద్ధం కారణంగా గత కొద్ది నెలలుగా అన్ని వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ ఆర్థికవేత్తలు (SBI Economists) ద్రవ్యోల్బణం (Inflation) పెరుగుదల, ఆర్బీఐ రెపో రేటు పెంపుపై ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. ద్రవ్యోల్బణం పెరుగుదలలో కనీసం 59 శాతం భౌగోళిక రాజకీయ అంశాలే కారణమని సోమవారం తెలిపారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిణామాలే సగానికిపైగా ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణం అవుతున్నాయన్నారు. ఇండియాలో మార్చిలో 6.95 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండగా.. ఏప్రిల్లో ఏకంగా 7.79 శాతానికి ఎగబాకింది. ఈ స్థాయిలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ ఏడాది ఆర్బీఐ రెపో రేటును మళ్లీ పెంచవచ్చని ఎస్బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. కరోనాకి ముందు 5.15 శాతంగా రెపో రేటు ఉంది. అయితే ఈ ఏడాది ఆగస్టు నాటికి మరో 75 బేసిస్ పాయింట్స్ (0.75 శాతం) పెంచి రేపో రేటును మళ్లీ 5.15 శాతానికి తీసుకురావాలని ఆర్బీఐ సిద్ధమైనట్లు ఎస్బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు.
రష్యా వల్ల ద్రవ్యోల్బణంపై ప్రభావాన్ని తాము అధ్యయనం చేశామని, భౌగోళిక రాజకీయ సంఘటనల వల్ల ధరలు 59 శాతం పెరిగాయని ఆర్థికవేత్తలు తెలిపారు. ఫిబ్రవరిని ఆధారంగా చేసుకొని చేసిన అధ్యయనంలో కేవలం యుద్ధం కారణంగానే.. ఆహారం, పానీయాలు, ఇంధనం, కాంతి, రవాణా ధరలు 52 శాతం పెరిగాయన్నారు. ప్యాకేజ్డ్ ఫుడ్ (FMCG) రంగంలో ఇన్పుట్ ధరల పెరుగుదల 7 శాతంగా ఉందన్నారు. ద్రవ్యోల్బణం ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని పేర్కొంటూ, ధరల పెరుగుదల విషయానికి వస్తే గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉందని తెలిపారు. గ్రామాలు అధిక ఆహార ధరల ఒత్తిడితో ఎక్కువగా ప్రభావితమవుతాయని, పట్టణాలు ఇంధన ధరల పెంపుదల కారణంగా ప్రభావితమవుతాయని వివరించారు.
Modi In Nepal : బుద్దుడి జన్మస్థలంలో మోదీ..భారత్-నేపాల్ స్నేహం సమస్త మానవాళికి ప్రయోజనకరమన్న ప్రధాని
ద్రవ్యోల్బణంలో కొనసాగుతున్న పెరుగుదలకు వ్యతిరేకంగా, రాబోయే జూన్, ఆగస్టు మానిటరీ పాలసీలలో ఆర్బీఐ రేట్లు పెంచుతుందని... ఆగస్టు నాటికి రెపో రేటును 5.15 శాతంతో ప్రీ-పాండమిక్ స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని ఎస్బీఐ ఆర్ధికవేత్తలు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే యుద్ధ-సంబంధిత ప్రభావాలు త్వరగా తగ్గకపోతే ద్రవ్యోల్బణం రేట్ల పెంపుదల తగ్గుతుందా అనేది అంచనా వేయడం ఆర్బీఐకి ఒక సవాలుగా మారింది.
ద్రవ్యోల్బణం పెరుగుదల తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. భారీ, స్థిరమైన రేటు పెరుగుదల విషయంలో వృద్ధి పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుందో లేదో కూడా చెక్ చేయాలని ఎస్బీఐ అభిప్రాయపడింది. రేట్ల పెంపు ద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యలకు మద్దతు ఇస్తూ, పెంపుదల వల్ల సానుకూల ప్రభావం కూడా ఉండవచ్చని ఆర్థికవేత్తలు తెలిపారు. అధిక వడ్డీ రేటు కూడా ఆర్థిక వ్యవస్థకు సానుకూలంగా ఉంటుంది, ఎందుకంటే నష్టాలు మారుతాయి అని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banking news, Rbi, Repo rate