తలయదేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రిలయన్స్, దాని అనుబంధ, భాగస్వామ్య (బీపీ, గూగుల్) సంస్థల్లో పనిచేస్తున్న 13 లక్షల మంది సిబ్బందికి టీకాలు వేయనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 880 నగరాల్లో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుంది. రిలయన్స్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగానే వ్యాక్సిన్ వేస్తామని రియలన్స్ కంపెనీ ఇది వరకే ప్రకటించింది. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు రిటైర్డ్స్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా టీకాలు వేస్తారు. ఇందుకోసం అర్హత కలిగిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కోవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం రిలయన్స్ ఆన్లైన్ హెల్త్ కేర్ ప్లాట్ఫారమ్ 'జియో హెల్త్ హబ్' ద్వారా తమ సమీపంలోని వ్యాక్సినేషన్ సెంటర్లో స్లాట్ బుక్ చేసుకోవాలి.
ప్రభుత్వ వర్క్స్పేస్ వ్యాక్సినేషన్ పాలిసీలో భాగంగా ఈ అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ను రిలయన్స్ తలపెట్టింది. జామ్నగర్, వడోదరా, హజిరా, దహేజ్, పాతళగంగ, నగోథానే, కానికాడ, గదిమోగా, సహ్దోల్, బారాబంకి, హోషియార్ పూర్లోని రిలయన్స్ ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్స్తో పాటు మొత్తం 880 నగరాల్లోని రిలయన్స్ ఆస్పత్రులు, భాగస్వామ్య ఆస్పత్రుల్లో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తారు. ఉద్యోగులకు అందుబాటులో ఉండేలా అపోలో, మ్యాక్స్, మనిపాల్ వంటి పలు కార్పొరేట్ ఆస్పత్రులతోనూ భాగస్వామ్యం కుదుర్చుకుంది రిలయన్స్.
ఒకవేళ ఇప్పటికే ఎవరైన ఉద్యోగులకు వ్యాక్సిన్ వేయించుకుంటే, దానికి అయిన ఖర్చులను కంపెనీ చెల్లిస్తుంది. రిలయన్స్కు చెందిన దాదాపు 3.40 లక్షల మంది ఇప్పటికే మొదటి డోస్ టీకా తీసుకున్నట్లు రిలయన్స్ వర్గాలు తెలిపాయి. జూన్ 15 నాటికి రిలయన్స్ ఉద్యోగులందరూ కనీసం మొదటి టీకా వేసుకునేలా రిలయన్స్ సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రిలయన్స్ ఉద్యోగులతో పాటు 13,000 వేల రిలయన్స్ రిటైల్, జియో స్టోర్ సిబ్బందికి కూడా ఈ ప్రోగ్రామ్ కింద టీకాలు వేస్తారు.
ప్రైవేట్ సంస్థలు వ్యాక్సిన్ల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత భారత్ బయోటెక్ (కోవాగ్జిన్), సీరం ఇన్స్టిట్యూట్ (కోవిషీల్డ్) నుంచి రిలయన్స్ సంస్థ పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు కొనుగోలు చేసింది. ముంబైతో పాటు మానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో ఇతర నగరాల్లోనూ ప్రారంభించనున్నారు. రిలయన్స్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న నగరాల్లో ఇప్పటికే పలు ఆస్పత్రులతో వ్యాక్సినేషన్ కోసం భాగస్వామ్యం కుదుర్చుకుంది.
రిలయన్స్ చేపట్టిన ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్.. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను సురక్షితంగా ఉంచండంతో పాటు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలపై భారాన్ని తగ్గించనుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. తద్వారా కరోనా మహమ్మారిపై మన దేశం చేస్తున్న పోరాటానికి సాయపడుతుందని వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona Vaccine, Covid-19, Reliance, Reliance Foundation, Sanjeevani