దేశమంతా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సీజన్ కొరత అధికంగా ఏర్పడడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సీజన్ అందక పేషెంట్లు మరణించిన ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కరోనా బాధితుల కోసం ఆక్సీజన్ తయారు చేసే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మొదలు పెట్టి సరఫరాకు చర్యలు ప్రారంభించింది. వాస్తవానికి రిలయన్స్ సంస్థ మెడికల్ ఆక్సీజన్ తయారీదారు కాదు. కానీ కరోనా విపత్తు నుంచి ప్రజలను కాపాడాలన్న లక్ష్యంతో ఆక్సీజన్ తయారు చేయడాన్ని సంస్థ ప్రాంభించింది. అతి కొద్ది రోజుల్లోనే సంస్థ 0 నుంచి 1000 MT మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సీజన్ ను తయారు చేసే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు భారత దేశంలో వినియోగిస్తున్న ఆక్సీజన్లో అత్యధికంగా 11 శాతం రిలయన్స్ సంస్థ నుంచి తయారు చేసిందే కావడం విశేషం. పది మందికి ఆక్సీజన్ అందిస్తే సరాసరిన అందులో ఒకరికి రిలయన్స్ ద్వారా తయారు చేసిందే అందించడం మరో విశేషం.
సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ స్వయంగా ఈ ఆక్సీజన్ తయారీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆక్సీజన్ ను తయారు చేయడమే కాకుండా దేశ వ్యాప్తంగా అవసరం ఉన్న ప్రదేశాలకు సరఫరా చేయడామే లక్ష్యంగా ఆయన సారథ్యంలోని బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. రిలయన్స్ లో ఉత్పత్తి చేయబడిన ఆక్సీజన్ ను వివిధ రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. తద్వారా నిత్యం దాదాపు లక్ష మంది రోగులకు ఉపశమనం కలుగుతోంది. దేశంలో కరోనా కేసులు ప్రారంభమైన గతేడాది మేలో రిలయన్స్ దేశ వ్యాప్తంగా 55,000 MT మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సీజన్ ను దేశ వ్యాప్తంగా సరఫరా చేసింది. ఆక్సీజన్ తయారు చేయడంతో పాటు సరఫరా చేయడం కూడా క్లిష్టమైన పని. వివిధ ప్రాంతాలకు ఆక్సీజన్ ను సరఫరా చేయడానికి అందుబాటులో ఉన్న మార్గాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉపయోగించుకుంటోంది. రైలు, రోడ్డు, వాయు రవాణా మార్గాల ద్వారా ఆక్సీజన్ ను తరలిస్తోంది.
ఈ అంశంపై రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. రెండవ వేవ్ కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రజల ప్రాణాలను కాపడడం కంటే తమకు ఏదీ ఎక్కువ కాదన్నారు. దేశంలో సాధ్యమైనంత మేర ఆక్సీజన్ తయారీని పెంచడంతో పాటు అవసరమైన ప్రాంతాలకు రవాణా చేయాల్సిన అవసరం ఉందన్నారు. జామ్ నగర్ లోని తమ ఇంజనీర్లు అవిశ్రాంతంగా పని చేస్తూ ఈ కరోనా కష్టకాలంలో దేశానికి ఆక్సీజన్ సరఫరా చేయడం తమకు గర్వంగా ఉందన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ మాట్లాడుతూ.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో తమకు సాధ్యమైనంత సాయం చేస్తున్నామన్నారు. ప్రతీ ప్రాణం విలువైనదేనన్నారు. జామ్ నగర్ లోని తమ ప్లాంట్స్ లో ఆక్సీజన్ తయారు చేసి దేశ వ్యాప్తంగా సరఫరా చేస్తున్నామన్నారు.
Disclosure: “Network18 and TV18 - the companies that operate News18 Telugu - are controlled by Independent Media Trust, of which Reliance Industries is the sole beneficiary.”
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Oxygen beds, Reliance, Reliance Foundation, Reliance Industries