వాహనదారులకు షాక్. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా 10వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. ఇవాళ పెట్రోల్ ధర 47 పైసలు, డీజిల్ ధర 57 పైసలు పెరిగింది. సోమవారం పెట్రోల్ ధర 48 పైసలు, డీజిల్ ధర 59 పైసలు, ఆదివారం పెట్రోల్ ధర 62 పైసలు, డీజిల్ ధర 64 పైసలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ మూడు రోజులే కాదు 10 రోజులుగా ఇంధనం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ 10 రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.5.47 పెరగగా, డీజిల్ ధర రూ.5.80 పెరిగింది. హైదరాబాద్లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.79.69 కాగా, డీజిల్ ధర రూ.73.49. న్యూ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.73 కాగా, డీజిల్ ధర రూ.75.19. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.80 దాటింది. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.83.62 కాగా, డీజిల్ ధర రూ.73.75.
పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచుతూ సామాన్యులపై భారం మోపడాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖండించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆమె లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచడాన్ని వ్యతిరేకించారు. ఇప్పటికే ప్రజలు పడుతున్న బాధల్ని తగ్గించడం ప్రభుత్వం విధి, బాధ్యత అని, వారిని మరిన్ని కష్టాలకు గురిచేయడం కాదని ఆమె అన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించారు. క్రూడ్ ఆయిల్ తగ్గడం ద్వారా వచ్చిన లాభాలను ప్రజలకు బదిలీ చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలని కోరారు.
Congress President Smt. Sonia Gandhi writes to the Prime Minister urging the govt to immediately roll back hikes on fuel prices & pass the benefit of low crude oil prices to the citizens. pic.twitter.com/NQstx7v5Ac
ఓవైపు గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా భారతదేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆయిల్ ధరలు పతనమైన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని పెంచి పెట్రోల్, డీజిల్ ధరల్ని ఫ్రీజ్ చేసింది. లాక్డౌన్ కారణంగా 82 రోజుల విరామం తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జూన్ 7 నుంచి వరుసగా పెట్రోల్ డీజిల్ ధరల్ని పెంచుతూ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.