ప్రపంచాన్ని శాసిస్తున్న దిగ్గజ కంపెనీల మధ్య మాటల యుద్ధం మళ్లీ తెరపైకి వచ్చింది. కేవలం వ్యాపార పరంగా పోటీ కాదు.. నేరుగా మాటల దాడి మొదలైంది. పెగాసస్ వివాదం ప్రపంచ టాప్ కంపెనీల మధ్య అగ్నికి ఆజ్యం పోస్తోంది. తాజాగా ఇజ్రాయిల్కు చెందిన ఎన్ఎస్ఓ పెగాసస్ స్పైవేర్తో ప్రముఖ జర్నలిస్టులు, పార్లమెంట్ సభ్యులు, ప్రతిపక్షనేతలు, మరి కొందరిపై గూఢాచర్యం చేస్తున్నట్లు వార్త కథనాలు వెలుగులోకి వచ్చాయి. పెగాసస్ వ్యవహారంపై ప్రతిపక్షాలు పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింపజేశాయి. తాజాగా పెగాసస్ వ్యవహారంపై టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ స్పందించారు. 2011 నుంచి రష్యాలో ఉన్నప్పటీ నుంచి నిఘా నీడలో బతకడం అలవాటు చేసుకున్నానని పేర్కొన్నారు. పెగాసస్ స్పైవేర్తో 2018 నుంచి తనపై గూఢాచర్యం నిర్వహిస్తుందని వెల్లడించాడు. తనపై గూఢచర్యం నిర్వహిస్తున్నారనే వార్త తనను పెద్దగా ఆశ్చర్యపర్చలేదని దురోవ్ పేర్కొన్నారు.
తాజాగా గూగుల్, ఆపిల్ దిగ్గజ ఐటీ కంపెనీల ద్వంద్వ వైఖరిపై పావెల్ దురోవ్ మండిపడ్డారు. గూగుల్, ఆపిల్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా భారీ మార్కెటును కల్గి ఉందని పేర్కొన్నాడు. ఈ కంపెనీలు ఆయా దేశాల్లోని ప్రభుత్వాలకు, ఇతర నియంత్రణ సంస్థలపై మోకారిల్లుతాయని పేర్కొన్నారు. పలు యూజర్ల డేటాను ఈ కంపెనీలు బ్యాక్డోర్ ద్వారా ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థల చేతిలో ఉంచుతాయని తెలిపారు. దీంతో యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. బ్యాక్డోర్ ద్వారా యూజర్ల డేటాను ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలకు అందించే సమయంలో థర్డ్ పార్టీ సంస్థలు యూజర్ల డేటాను తస్కరించే అవకాశం ఉందని వెల్లడించారు. దీనికి పెగాసస్ స్పైవేర్ చక్కని ఉదాహరణ అని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు కేవలం రెండు రకాల ప్లాట్ఫాంలు అందుబాటులో ఉండడంతో తప్పని సరిగా గూగుల్, ఆపిల్ కంపెనీలపై యూజర్లు ఆధారపడవలసి వస్తోందని పేర్కొన్నారు. గూగుల్, ఆపిల్ కంపెనీలకు చెందిన ఆపరేటింగ్ సిస్టమ్లను ఉపయోగించకుండా మరిన్ని వోఎస్లు ఉన్న పోటీ వాతావరణం ఉండాలని అభిప్రాయపడ్డారు. దురోవ్ పావెల్ గతంలో గూగుల్, ఆపిల్ కంపెనీలపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అన్ని డిజిటల్ వస్తువులపై గూగుల్, ఆపిల్ కంపెనీలు 30 శాతం పైగా సేల్స్ టాక్స్ను విధించినందుకు తప్పుబట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.