2020-21 ఆర్థిక సంవత్సరానికి (2021-22 అసెస్మెంట్ సంవత్సరం) సంబంధించి ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉంది. ఈ తేదీ సమీపిస్తున్న వేళ లక్షల కొద్దీ పన్ను చెల్లింపుదారులు రిటర్న్లను దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆసక్తికర గణాంకాలను వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు ఏకంగా మూడు కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయని కేంద్రం తాజాగా తెలిపింది. తుది గడువు దగ్గర పడుతున్నందున ఇంకా రిటర్నులు దాఖలు చేయనివారు వీలైనంత త్వరగా ఐటీఆర్ ఫైల్ చేయాలని ఆర్థిక శాఖ సూచించింది. పొడిగించిన గడువు తేదీ డిసెంబర్ 31 సమీపిస్తున్నందున ప్రతిరోజూ నాలుగు లక్షలకు పైగా ఐటీఆర్లు ఫైల్ అవుతున్నాయని.. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని కేంద్రం తెలిపింది.
పన్ను చెల్లింపుదారులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తమ ఆదాయపు పన్ను రిటర్న్లను ఫైల్ చేసేలా కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఇందుకు గాను ఈ-మెయిల్స్, ఎస్ఎంఎస్, మీడియా ప్రచారాల ద్వారా ఐటీ రిటర్న్స్ గురించి గుర్తు చేస్తోంది. చివరి నిమిషంలో గందరగోళం ఏర్పడకుండా వీలైనంత త్వరగా 2021-22 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన రిటర్న్లను దాఖలు చేయాలని ఐటీ డిపార్ట్మెంట్ కోరుతోంది.
టీడీఎస్, పన్ను చెల్లింపుల కచ్చితత్వాన్ని వెరిఫై చేసేందుకు.. అలాగే ఫ్రీ ఫైలింగ్ ఐటీఆర్లను పొందడానికి ఐటీఆర్ దాఖలు చేసే చెల్లింపుదారులందరూ ఫారం 26 ఏఎస్, యాన్యువల్ ఇన్ఫర్మేన్ స్టేట్మెంట్ (AIS)ని ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా సరిచేసుకోవాలని కేంద్రం ఓ ప్రకటనలో సూచించింది. పన్ను చెల్లింపుదారులు తమ బ్యాంక్ పాస్బుక్, వడ్డీ సర్టిఫికేట్, ఫారం 16, ఈక్విటీ/మ్యూచువల్ ఫండ్ల కొనుగోళ్లు, బ్రోకరేజ్ల లాభాల స్టేట్మెంట్లను ఏఐఎస్ (AIS) స్టేట్మెంట్లోని డేటాతో క్రాస్ చెక్ చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ ఈ రెండింటిలో ఏదైనా తేడా ఉంటే వాటిని సరి చేయడానికి ఈ క్రాస్ చెక్ ఉపయోగపడుతుంది.
AY 2021-22కి సంబంధించి ఇప్పటి వరకు సమర్పించిన ఐటీఆర్ల ఫైలింగ్ సంఖ్య 3.03 కోట్లకు పెరిగింది. వీటిలో ఐటీఆర్-1లు 1.78 కోట్లు (58.98%), ఐటీఆర్-2లు 24.42 లక్షలు (8%), ఐటీఆర్-3లు 26.58 లక్షలు (8.7%), ఐటీఆర్-4లు 70.07 లక్షలు (23.12%), ఐటీఆర్-5లు 2.14 లక్షలు, ఐటీఆర్-6లు 0.91 లక్షలు, ఐటీఆర్-7లు 0.15 లక్షలు ఉన్నాయని ఆర్థిక శాఖ పేర్కొంది. మొత్తం ఐటీఆర్లలో 52 శాతానికి పైగా దాఖలైన రిటర్న్స్ అన్నీ పోర్టల్లోని ఆన్లైన్ ఐటీఆర్ ఫారంను ఉపయోగించి ఫైల్ చేసినవే అని ఆర్థిక శాఖ కేంద్రం తెలిపింది. మిగిలినవి ఆఫ్లైన్ సాఫ్ట్వేర్ యుటిలిటీల ద్వారా క్రియేట్ అయిన ఐటీఆర్ను ఉపయోగించి దాఖలు చేశారని కేంద్రం వివరించింది.
ఆదాయ పన్ను శాఖ ఐటీఆర్ ప్రాసెసింగ్ను ప్రారంభించాలన్నా, రీఫండ్లను జారీ చేయాలన్నా.. ఆధార్ ఓటీపీ, ఇతర పద్ధతుల ద్వారా ఈ- వెరిఫికేషన్ అనేవి చాలా అవసరం. అయితే ఈసారి 2.69 కోట్ల రిటర్న్లు ఈ-వెరిఫై పూర్తి చేసుకుంటే.. అందులో 2.28 కోట్లకు పైగా ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారానే వెరిఫికేషన్ పూర్తి చేసుకోవడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IT Returns