ఇండియా బ్యాంకింగ్ సెక్టార్లో కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకొస్తోంది. చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకులలో విలీనం చేసే చర్యలు కొనసాగిస్తోంది. విలీనం ద్వారా చిన్న బ్యాంకులు ఆర్థికంగా దెబ్బతినకుండా నూతన ఆదాయాలు మార్గాలు దొరుకుతాయని కేంద్రం అభిప్రాయపడుతోంది. మార్కెట్ షేర్ పెరగడం, నిర్వహణ ఖర్చులు తగ్గడం, పెట్టుబడులు సాధించటం వంటివి ఈ విలీనం ద్వారా లభిస్తాయని చెబుతోంది. అయితే తాజాగా ప్రైవేటీకరణకు సంబంధించిన వివరాలను నీతి ఆయోగ్ ప్రకటించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
నీతి అయోగ్ ప్రకటన
యూనియన్ బడ్జెట్ 2023కి ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. ప్రభుత్వ అధికారులు బ్యాంకింగ్ సంస్థల ప్రైవేటీకరణ కోసం విస్తృతమైన సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా నీతి ఆయోగ్ ప్రైవేటీకరించనున్న ఆర్థిక సంస్థల పేర్లను ప్రకటించింది. తొలుత నీతి ఆయోగ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ను ప్రైవీటీకరిస్తుందని విశ్లేషణలు వినిపించాయి. అయితే కొత్త నివేదిక ప్రకారం .. రెండు ప్రధాన బ్యాంకులైన ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలను సిఫార్సు చేసింది.
ప్రైవేటీకరణ చెయ్యని బ్యాంకులు
ప్రభుత్వం ఇప్పుడు రెండు బ్యాంకులు, ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రైవేటీకరించే యోచనలో ఉంది. DNA నివేదిక ప్రకారం .. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సిఫార్సు ప్రకారం కొన్ని బ్యాంకులను ప్రైవేటీకరణ చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నాయి. 2019 ఆగస్టులో ప్రభుత్వం 10 బ్యాంకులను నాలుగు బ్యాంకుల్లో విలీనం చేసింది. మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను 27 నుంచి 12కి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన
గత బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ .. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించారు. 2019లో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ బ్యాంకుల(PSB) కోసం మెగా-విలీన ప్రణాళికను ప్రారంభించింది. విలీనం 2021 ఏప్రిల్లో అమల్లోకి వచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ , యునైటెడ్ బ్యాంక్లు విలీనం అయ్యాయి. కెనరా బ్యాంక్లో సిండికేట్ బ్యాంక్ మెర్జ్ అయింది. యూనియన్ బ్యాంక్లో ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ను విలీనం చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంకుల విలీనం అమల్లోకి వస్తుంది.
అయితే నీతి ఆయోగ్ ప్రైవేటీకరణకు రెండు బ్యాంకుల పేర్లను సూచించగా.. వాటిని ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. త్వరలో ప్రారంభమయ్యే రాబోయే బడ్జెట్ సెషన్లో పబ్లిక్ సెక్టార్ల ఆర్థిక పరిస్థితి, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి ఆర్థిక మంత్రి కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Niti Aayog