అగ్రరాజ్యం అమెరికా (America)లో ఆర్థిక పరిస్థితులు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. దీంతో పలు కార్పొరేట్ కంపెనీలు ఖర్చుల భారం తగ్గించుకునేందుకు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. గత సంవత్సరం నుంచి ఇప్పటిదాకా టెక్ పరిశ్రమలు సుమారు 2.80 లక్షల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. ఈ ఏడాది మరింత పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. రెండు నెలల్లోనే అమెరికా కంపెనీలు 1.80 లక్షల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. ఉద్యోగాల తొలగింపు 40 శాతానికి చేరే అవకాశం ఉందని లేఆఫ్స్ ట్రాకింగ్ వెబ్సైట్ తెలిపింది. ఇలాంటి భయాల మధ్యలో ఫేస్బుక్ మాతృసంస్థ మెటా మరో షాక్ ఇచ్చింది. అదేంటంటే..
* షాక్ ఇచ్చిన మెటా
దిగ్గజ టెక్ కంపెనీ మెటా.. మరోసారి 10 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. నాలుగు, అయిదు నెలల క్రితం 11 వేల మందిని తొలగించింది. రెండో రౌండ్లో కూడా అదే స్థాయిలో జాబ్లు తీసేందుకు సిద్ధమైంది. దీనిపై సంస్థ సీఈవో మార్క్ జుకర్బర్గ్ మాట్లాడారు. తమ బృంద పరిణామంలో 10,000 మందిని తొలగించనున్నట్లు చెప్పారు. అలాగే 5000 అదనపు ఉద్యోగుల నియామకం కూడా ప్రస్తుతం ఉండదన్నారు.
* దిద్దుబాటు చర్యల్లో భాగమే
కొన్ని నెలల క్రితమే 11 వేల మందిని అంటే మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం మందిని తొలగించారు. ఇప్పుడు మరో 10 వేల మందిని ఉద్యోగంలో నుంచి తీసివేయనున్నారు. మెటా దిద్దుబాటు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సంస్థ పునర్నిర్మాణ పనులు విస్తరించడం, అంతగా ప్రాధాన్యం లేని ప్రాజెక్టులను రద్దు చేయడం, నియామకాల తగ్గింపు, లేఆఫ్లు వంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
* ఖర్చుల కుదింపు
సంస్థ వార్షిక ఖర్చులను 95 బిలియన్ డాలర్ల నుంచి 89 బిలియన్ డాలర్లకు తగ్గించాలనే ఆలోచనలో మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో 2023 సంవత్సరం సంస్థకు `ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ`గా నిలుస్తుందని అంటున్నారు.
ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో.. మెటాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని, వ్యాపారాన్ని మెరుగుపరచడానికి ఇంకా మెరుగైన ఫలితాలను సాధించడానికి కంపెనీ సోర్సెస్ మరింత సమర్థవంతంగా ఉపయోగించాలని యోచిస్తున్నట్లు మార్క్ జుకర్బర్గ్ తెలిపారు. తొలగింపులు ఏప్రిల్ చివరిలో జరుగుతాయని, అయితే బిజినెస్ టీమ్లు మే చివరి నాటికి ప్రభావితమవుతాయని అన్నారు.
ఇది కూడా చదవండి : సూపర్ ఫీచర్లతో హోండా షైన్ 100cc వచ్చేసింది.. దీని ధర స్ప్లెండర్ కంటే తక్కువే!
రెండో రౌండ్ తొలగింపులను ప్రకటించిన మొదటి అతిపెద్ద టెక్ కంపెనీ ఇదే. 2022 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు 2.90 లక్షల మందిపై వేటు పడింది. దీనిలో 40 శాతం కోతలు 2023లో జరిగాయని లేఆఫ్ ట్రాకింగ్ సైట్ https://layoffs.fyi/ వెల్లడించింది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.