లోక్సభ తొలి విడత ఎన్నికల్లో మీరు ఓటు వేస్తున్నారా? అయితే మీరు పెట్రోల్పై డిస్కౌంట్ పొందొచ్చు. పెట్రోల్ మాత్రమే కాదు డీజిల్పైనా తగ్గింపు లభిస్తుంది. కొన్ని ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో మీ వేలిపై ఇంకు గుర్తు చూపించి లీటర్ పెట్రోల్ లేదా డీజిల్పై 50 పైసల డిస్కౌంట్ పొందొచ్చు. పోలింగ్ డే రోజున దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆల్ ఇండియా పెట్రోలియమ్ డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఎన్నికల్లో ఓటు వేసేలా ప్రజల్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సాల్ తెలిపారు.
దేశంలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రమే మీరు ఈ ఆఫర్ పొందొచ్చు. మీరు ఓటు వేయగానే పెట్రోల్ బంకుకు వెళ్లి మీ వేలిపై ఉన్న ఇంకు గుర్తు చూపించి డిస్కౌంట్ అడగొచ్చు. పోలింగ్ డే రోజున ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆఫర్ ఉంటుంది. కస్టమర్లు తమ పేరు మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరికి గరిష్టంగా 20 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ మాత్రమే ఇస్తారు. ఈ ఆఫర్ గురించి పెట్రోల్ బంకుల్లో కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు డీలర్లు. ఈ డిస్కౌంట్ను ఆయిల్ కంపెనీలు కాకుండా డీలర్లు ఆఫర్ చేయడం మరో విశేషం. దేశంలో మొత్తం 64,000 పెట్రోల్ బంకులు ఉంటే 58,000 పెట్రోల్ బంకుల్లో ఆఫర్ పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.