IRCTC Tirupati Balaji Pratyeka Pravesha Darshnam | శ్రీవారి భక్తులకు గమనిక. తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో కలిపి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. వివరాలు తెలుసుకోండి.
లాక్డౌన్ కారణంగా ఇన్నాళ్లూ తిరుపతి వెళ్లలేకపోయారా? తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా? కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గుతుండటంతో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC తిరుపతికి టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'తిరుపతి బాలాజీ ప్రత్యేక ప్రవేశ దర్శనం' పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనంతో శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ హైదరాబాద్లో ప్రారంభం అవుతుంది. ఒక రాత్రి, రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్యాకేజీ బుక్ చేసుకున్న శ్రీవారి భక్తులను హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్లో తీసుకెళ్తుంది ఐఆర్సీటీసీ. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు కాణిపాకం, శ్రీనివాసమంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూరు కవర్ అవుతాయి.
IRCTC Tirupati Balaji Pratyeka Pravesha Darshnam: టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే...
ఐఆర్సీటీసీ 'తిరుపతి బాలాజీ ప్రత్యేక ప్రవేశ దర్శనం' ప్యాకేజీ బుక్ చేసుకున్న భక్తులు మొదటి రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఫ్లైట్ ఎక్కాలి. ఉదయం 8.25 గంటలకు తిరుపతి చేరుకుంటారు. ఆ తర్వాత హోటల్లో చెకిన్ కావాలి. మధ్యాహ్న భోజనం తర్వాత కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం తీసుకెళ్తారు. రాత్రికి తిరుపతిలోనే బస చేయాలి.
రెండో రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెకౌట్ కావాలి. ఆ తర్వాత తిరుమల తీసుకెళ్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తిరుచానూర్ బయల్దేరాలి. తిరుచానూర్లో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులను తిరుపతి ఎయిర్పోర్టులో డ్రాప్ చేస్తుంది ఐఆర్సీటీసీ. తిరుపతిలో సాయంత్రం 6.40 గంటలకు ఫ్లైట్ ఎక్కితే రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ 'తిరుపతి బాలాజీ ప్రత్యేక ప్రవేశ దర్శనం' ప్యాకేజీ 2021 జూలై 17, 30, ఆగస్ట్ 14, 18 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.13,900, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.14,000, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.15,685. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, ఒక రాత్రి హోటల్లో బస, ఒక బ్రేక్ఫాస్ట్, రెండు లంచ్, ఒక డిన్నర్, ప్రైవేట్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమల, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురంలో దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను https://www.irctctourism.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.