కోవిడ్-19 ప్రజల ఆలోచన విధానాన్ని మార్చేసింది. మహమ్మారి తరువాత ప్రజల ఆర్థిక పరమైన ఆలోచనల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. సొంత ఇళ్లు, హెల్త్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్స్ అవసరాలను గుర్తించారు. వైద్య చికిత్సలకు అయ్యే ఖర్చులను తగ్గించుకునేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం కోవిడ్-19 చికిత్సను కూడా ఇన్సూరెన్స్ పాలసీల్లో చేర్చారు. అందువల్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లో సైతం మెడికల్ ఖర్చులను భర్తీ చేసే పాలసీలను ఎక్కువ మంది భారతీయులు ఎంచుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. దీంతో పాటు ఇతర ఇన్సూరెన్స్ పాలసీలకు కూడా మన దేశంలో డిమాండ్ పెరుగుతోంది. సైబర్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్ వంటి పాలసీలపై అవగాహన పెరగడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
హోమ్ ఇన్సూరెన్స్
ప్రపంచవ్యాప్తంగా గృహాలు, ఇతర నిర్మాణాలకు సైతం ఇన్సూరెన్స్ పాలసీలు అందించే కంపెనీలు ఎన్నో ఉన్నాయి. విపత్తులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని నిర్మాణాలకు హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. సహజ విపత్తుల కారణంగా ఆకస్మిక౦గా వాటిల్లే నష్టాన్ని ఇలాంటి పాలసీలు భర్తీ చేస్తాయి. మన దేశంలో ప్రకృతి వైపరీత్యాల ప్రమాదం ఏటా పెరుగుతోంది. వాతావరణ మార్పుల ప్రభావంతో వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలకు ఆదరణ పెరుగుతోంది.
సైబర్ ఇన్సూరెన్స్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించాయి. మరికొన్ని నెలలు వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పనులు కొనసాగే అవకాశం ఉంది. ఈ క్రమంలో కంపెనీలు డేటా భద్రత కోసం సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నాయి. చాలా మంది సైబర్ నేరగాళ్లు కంపెనీల సున్నితమైన డేటాను దొంగిలించి, సంస్థల నుంచి డబ్బు వసూలు చేసే ప్రయత్నాల్లో ఉంటున్నారు. ఇలాంటి సమాచారాన్ని యాక్సెస్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఠాలు సైతం ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో రాన్సమ్ వేర్ ద్వారా అనేక పెద్ద సంస్థలను సైబర్ నేరస్థులు టార్గెట్ చేశారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మెరుగైన డేటా సెక్యూరిటీకి భరోసా ఇచ్చే సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలకు డిమాండ్ పెరుగుతోంది.
పే ఆస్ యూ యూజ్ (Pay as you use) ఇన్సూరెన్స్
కరోనావైరస్ వ్యాప్తి తరువాత ఇన్సూరెన్స్ కంపెనీలు కొత్తగా 'పే యాజ్ యు డ్రైవ్' పాలసీలను ప్రవేశపెడుతున్నాయి. ఇది ఒక రకం మోటార్ వెహికిల్ ఇన్సూరెన్స్. దీనివల్ల వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది. సాధారణ మోటార్ వెహికిల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధర ఎక్కువగా ఉంటుంది. కానీ ‘పే యాజ్ యు డ్రైవ్’ పాలసీల్లో ఈ భారం తగ్గుతుంది. దీంట్లో ఒక వాహనం ప్రయాణించిన దూరంపై ఇన్సూరెన్స్ ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ఒకటికంటే ఎక్కువ వాహనాలు ఉన్నవారు, కార్లను పెద్దగా వాడనివారు దీన్ని ఎంచుకోవచ్చు. కొంతమంది ఆరోగ్య కారణాల వల్ల సొంత వాహనాలను ఎక్కువగా వాడరు. మరికొంతమందికి వాహనాలు ఉన్నా ప్రజా రవాణాను వినియోగిస్తూ ప్రయాణ ఖర్చులు తగ్గించుకుంటారు. ఇలాంటి వారికి ఇన్సూరెన్స్ ప్రీమియం భారం చాలా వరకు తగ్గుతుంది.
బైట్ సైజ్ ఇన్సూరెన్స్
కొన్ని ప్రత్యేకమైన అవసరాల కోసం తీసుకునే ఇన్సూరెన్స్ పాలసీలను ఎన్నో కంపెనీలు అందిస్తున్నాయి. విస్తృతమైన అవసరాలకు బదులుగా కొన్ని సాధారణ అవసరాలకు అతి తక్కువ ప్రీమియంతో ఇలాంటి పాలసీలు తీసుకోవచ్చు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు.. క్రెడిట్ కార్డు ప్రొటెక్షన్, విమానాల ఆలస్యంపై చెల్లించే ఇన్సూరెన్స్, ఆటల్లో లేదా జిమ్లో గాయపడటం.. బాణసంచా వల్ల గాయాల పాలవడం.. వంటి అవసరాలకు రూ.200 ప్రీమియంతో ఇన్సూరెన్స్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇన్సూరెన్స్ పరిధిని పెంచడానికి ఇలాంటి పథకాలు ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం ఇలాంటి వాటికి కూడా ఆదరణ క్రమంగా పెరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Insurance