భారత్లో తయారైన సెమీ-హైస్పీడ్ రైలు ‘వందే భారత్’ (Vande Bharath) ఎక్స్ప్రెస్కు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ కనిపిస్తోంది. దీంతో వీటిని దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని రైల్వే శాఖ (Railway Department) భావిస్తోంది. వచ్చే ఏడాది (2024) నాటికి మరో 67 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు (Vande Bharath Express) అందుబాటులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటుకు వెల్లడించింది. ప్రస్తుతం ఈ రైళ్లు అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపింది. లోక్సభలో అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. మొత్తం 102 వందేభారత్ రైళ్లకు సంబంధించిన తయారీ ప్రణాళిక గురించి కేంద్రం మంత్రి వివరించారు.
2023-24 నాటికి మరో 67 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను రైల్వేకు అప్పగించనున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మొదటి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 2019 ఫిబ్రవరిలో ఢిల్లీ- వారణాసి మధ్య ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 రూట్లలో వందేభారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి.
* 102 రైళ్ల తయారీ
2022-23 ఆర్థిక సంవత్సరంలో 35, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 67 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వందే భారత్ రైళ్ల తయారీ ప్రాజెక్టును పీహెచ్-21 రోలింగ్ స్టాక్ ప్రోగ్రామ్(క్యారేజెస్) కింద చేపట్టింది. ఈ మేరకు 2022-23కి సంబంధించి వ్యయం అంచనాలను సవరించింది. రూ.19,479 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు కింద వందేభారత్ రైళ్లతో పాటు, కోచ్లకు సంబంధించిన సామగ్రిని సమకూర్చాల్సి ఉంటుంది.
* స్లీపర్ వెర్షన్ రైళ్లు
మొత్తంగా చైర్ కార్ వెర్షన్లో 75 వందేభారత్ రైళ్లను ఉత్పత్తి చేయనున్నారు. ఇక, మిగతా రైళ్లను స్లీపర్ వెర్షన్లుగా తీర్చి దిద్దనున్నారు. అదనంగా మరో 400 స్లీపర్ వెర్షన్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను తయారు చేయడానికి టెండర్లను భారతీయ రైల్వే ఆహ్వానించింది. దేశంలోని ఇండియన్ రైల్వే ప్రొడక్షన్ యూనిట్లలో సిబ్బందితో కలిసి పనిచేసే సంస్థలకు ఈ అవకాశం ఇవ్వనుంది. ఇవే కాకుండా 8000 వందేభారత్ రైల్ కోచ్ల తయారీకి 2023-24 బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీలు ఇండియన్ రైల్వే ప్రొడక్షన్ యూనిట్లుగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి : పదేళ్ల కంటే పాత ట్రాక్టర్లకు స్క్రాపేజ్ పాలసీ వర్తించదు.. కేంద్రం క్లారిటీ!
* ‘కవచ్’తో రైల్వే నెట్వర్క్
ప్రతిపాదిత రైల్వే నెట్వర్క్ని క్రమానుగతంగా ‘కవచ్’ వ్యవస్థతో అనుసంధానం చేయనుంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 1455 కిలోమీటర్ల రైలు మార్గాన్ని ‘కవచ్’తో అనుసంధానం చేశారు. ఈ మార్గంలో రైళ్లు ఎదురెదురుగా ఢీ కొట్టే సందర్భం వచ్చినప్పుడు ఇరు రైళ్ల లోకోపైలట్లను హెచ్చరించే వ్యవస్థనే ‘కవచ్’గా పిలుస్తున్నాం. ఢిల్లీ- ముంబై, ఢిల్లీ- హౌరా రైలు మార్గంలోనూ 3000కిలోమీటర్ల మేర ఈ ‘కవచ్’ పనులు చేపట్టేందుకు టెండర్లను పిలవాల్సి ఉంటుంది. మరోవైపు, రైలు కార్గోలను మెరుగు పరచడానికి కూడా కేంద్రం తగు చర్యలు తీసుకుంటోందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto, Indian Railways, Vande Bharat Train