INDIA RELAXES WHEAT EXPORT BAN ALLOWS EXPORT OF SHIPMENTS BOOKED BEFORE MAY 13 BAN MKS
Wheat: ఇండియా గోధుమలపై ప్రపంచం గగ్గోలు.. ఎగుమతిపై నిషేధం సడలింపు.. ఈజిప్టుకు 1.67 టన్నుల సరుకు
గోధుమలపై కేంద్రం తాజా ప్రకటన
గోధుమల ఎగుమతిపై భారత్ నిషేధం విధించిన క్రమంలో ప్రపంచ దేశాలు గగ్గోలుపెడుతున్నాయి. సంక్షోభ సమయంలో గోధుమల ఎగుమతులు నిషేధించడం సరికాదంటూ జీ-7 దేశాలు భారత్ పై మండిపడ్డాయి. తాజాగా కేంద్రం కొన్ని సడలింపులు ప్రకటించింది. వివరాలివే..
‘యావత్ ప్రపంచానికి అన్నం పెట్టగలిగే సత్తా భారత్ కు మాత్రమే ఉంది.. సంక్లిష్ట సమయాల్లో ఇండియా మానవాళికి అండగా ఉంటుంది..’ అంటూ డబ్ల్యూటీవో సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో చేసిన ప్రసంగం మళ్లీ చర్చలోకి వచ్చింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో భారత్ గోధుమల ఎగుమతిపై నిషేధం విధించిన క్రమంలో ప్రపంచ దేశాలు గగ్గోలుపెడుతున్నాయి. సంక్షోభ సమయంలో గోధుమల ఎగుమతులు నిషేధించడం సరికాదంటూ జీ-7 దేశాలు భారత్ పై మండిపడ్డాయి. విచిత్రంగా ఈ విషయంలో చైనా మనకు మద్దతుగా నిలిచింది. ధరలను అదుపు చేయడానికే గోధుల ఎగుమతులను నిషేధించినట్లు చెపపిన కేంద్రం.. అంతర్జాతీయంగా వస్తోన్న అభ్యర్థలనల నేపథ్యంలో నిషేధాన్ని కొంతమేరకు సడలించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి సవరణ ఆదేశాలు జారీ అయ్యాయి. వివరాలివే..
గోధుమల ఎగుమతిపై నిషేధాజ్ఞలలో కాస్త సడలింపు నిచ్చింది కేంద్ర ప్రభుత్వం. గోధుమల కన్సైన్మెంట్లను పరీక్ష కోసం, సిస్టమ్స్లో రిజిస్ట్రేషన్ కోసం కస్టమ్స్కు మే 13న లేదా అంతకు ముందు అప్పగించినట్లయితే, అటువంటి కన్సైన్మెంట్లను ఎగుమతి చేయడానికి అనుతిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
ఈజిప్టునకు వెళ్ళే గోధుమల కన్సైన్మెంట్కు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ కన్సైన్మెంట్ ఇప్పటికే కాండ్లా నౌకాశ్రయంలో లోడింగ్ అవుతోంది. ఈజిప్టు ప్రభుత్వంతోపాటు, ఈ గోధుమలను ఎగుమతి చేస్తున్న మెసర్స్ మీరా ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజ్ఞప్తి మేరకు ఈ కన్సైన్మెంట్కు అనుమతి ఇచ్చింది. 61,500 మెట్రిక్ టన్నుల గోధుమలను ఈజిప్టునకు ఎగుమతి చేయబోతున్నారు.
దేశీయంగా ఆహార భద్రతను కాపాడుకుంటూనే కేంద్రం అనుమతిస్తే ఆకలితో అలమటించే దేశాలకు గోధుమల ఎగుమతిని పరిశీలిస్తామని వాణిజ్య మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్ లో పేర్కొనడం గమనార్హం. అలాగే, రద్దు చేయడానికి వీలు లేని ఒప్పందాలు (లెటర్స్ ఆఫ్ క్రెడిట్) కూడా ముందుకు సాగుతాయని, నోటిఫికేషన్ జారీ అయిన తేదీన లేదా అంతకు ముందు ఒప్పందాలు జరిగినట్లయితే ఆ మేరకు రుజువులు, రికార్డులు చూపించి ఎగుమతులు చేసుకోవచ్చనీ కేంద్రం తాజాగా సడలింపులిచ్చింది.
గోధుమల ఎగుమతిపై భారత దేశం నిషేధం విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం వీటి ధరలు 6 శాతం పెరిగాయి. మన దేశంలో 4 నుంచి 8 శాతం వరకు తగ్గిపోయాయి. రాజస్థాన్లో క్వింటాలు గోధుమల ధర రూ.200 నుంచి రూ.250 వరకు తగ్గింది. పంజాబ్లో రూ.100 నుంచి రూ.150 వరకు తగ్గింది. ఉత్తర ప్రదేశ్లో రూ.100 వరకు తగ్గింది. అన్ని రకాల గోధుమల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం శనివారం నిషేధం విదించిన సంగతి తెలిసిందే. అత్యధిక ప్రొటీన్ ఉండే గోధుమలు, సాధారణ సాఫ్ట్ బ్రెడ్ రకాల గోధుమల ఎగుమతులను కూడా నిషేధించింది.
గోధుమల ఎగుమతిలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న రష్యా, నాలుగో స్థానంలో ఉన్న ఉక్రెయిన్ దేశాలు మూడు నెలలుగా యుద్ధం చేసుకుంటుడటంతో ఎగుమతులు నిలిచిపోయి గ్లోబల్ గా గోధుమలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో యూరప్, అమెరికా దేశాలు ఇండియా నుంచి దిగుమతులను పెంచాయి. ఉన్న గోధుమలు విదేశాలకు వెళుతుండటంతో దేశీయంగా ఇండియాలో ధరలు పెరిగాయి. గోధుమపిండి ధర కొద్ది కాలంలోనే 14శాతం పెరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించింది. కాగా,
గోధుముల ఎగుమతులపై భారత్ విధించిన ఆంక్షలపై జీ 7 దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రపంచదేశాలకు అన్నం పెడతానన్న మోదీ ఇలాంటి కీలక సమయాల్లో ముఖ్యమైన ఆహారంపై నిషేధం విధించడమేంటనే విమర్శలు వచ్చాయి. కాగా, దేశీయంగా ధరలను కంట్రోల్ చేయడం, ఆహారభద్రతను కాపాడేందుకే ఎగుమతులపై నిషేధం విధించినట్లు కేంద్రం బదులిచ్చింది. జీ7దేశాల గోధుమల గగ్గోలు అంశంలో అనూహ్యంగా భారత్కు చైనా మద్దతు తెలిపింది. గోధుమ ఎగుమతి నిలిపివేతపై జీ 7 దేశాలు భారత్ను విమర్శించడం సరికాదని వ్యాఖ్యానిస్తూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.